రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల నేత కార్మికులు మరోమారు ఆందోళనకు దిగారు. ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని బీవై నగర్లో చేనేత జౌళీ శాఖ కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లు ఇవ్వడం వల్ల వేలాది మంది కార్మికులకు చేతి నిండా పని లభించిందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరల తయారీ నిలిపి వేయడం వల్ల ఉపాధి పనిలేక అనేక కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వస్త్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ వేలాది మంది కార్మికుల కుటుంబాలు నేడు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయని తెలిపారు. కార్మికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు.
కార్మికులకు రావాల్సిన యార్న్ సబ్సిడీ బకాయిలు విడుదల చేయాలని పలుమార్లు కలెక్టర్, మంత్రులకు వినతి పత్రాలు సమర్పించిన స్పందించడం లేదని చెప్పారు. వెంటనే యార్న్ సబ్సిడీ విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్కర్ టూ ఓనర్ పథకాన్ని అమలు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, అన్నల్దాస్ గణేశ్, నక్క దేవదాస్, కూచన శంకర్, మల్లారెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.