హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు చెరువులు ఆహ్లాదం పంచేవి. స్థానికుల అవసరాలు తీర్చేవి. కాలక్రమేణా వాటి అవసరాలు తగ్గడంతో కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. ఇది ఒకప్పటి మాట. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక చెరువుల దశదిశ మారింది. వాటిని శుద్ధి చేసి స్వచ్ఛంగా మార్చాలని సంకల్పించింది. ఫలితంగా ఇప్పుడు చెరువులు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ మార్గదర్శకాలతో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ఆ దిశగా అడుగులు వేస్తున్నది. కార్పొరేషన్ చైర్మన్ వీ ప్రకాశ్ అధ్యక్షతన జరిగిన గత జనరల్ బాడీ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో కాలుష్య కాసారాలుగా మారిన చెరువులను అతి తక్కువ ఖర్చుతో బయో ఎంజైముల ద్వారా శుద్ధి చేయాలని నిర్ణయించారు.
పైలట్ ప్రాజెక్టుగా సున్నంచెరువు
థాయిలాండ్ తదితర దేశాలు బయో ఎంజైములతో చెరువులను శుద్ధి చేసే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కూకట్పల్లి మండలం అల్లాపూర్ గాయత్రీనగర్లోని సున్నం చెరువును శుద్ధి చేసేందుకు బయో ఎంజైములతో స్వచ్ఛందంగా శుద్ధి చేసేందుకు ఎన్వోజైమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. దీంతో పైలట్ ప్రాజెక్టుగా ఆ చెరువు శుద్ధి బాధ్యతను దానికి అప్పగించారు. సంస్థ తొలుత చెరువులోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రం చేసింది. సమీపంలోని నివాస ప్రాంతాల నుం చి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకుం ది. చెరువు నీటిని సేకరించి ఈపీటీఆర్ఐ, జేఎన్టీయూ ల్యాబ్కు పరీక్షలకు పంపింది. నీళ్లలో అమ్మోనియా, నైట్రేట్, హెచ్టూఎస్ వంటి విషవాయువులు తీవ్రస్థాయిలో ఉన్నట్టు గుర్తించి వాటిని తొలగించి నీటిని శుద్ధి చేసేందుకు జీవచికిత్స ప్రారంభించింది. ఈ క్రమంలో వారం రోజుల నుంచే ఫలితాలు రావడం మొదలైంది. ఎన్వోజైమ్ టెక్నాలజీస్ కృషితో 45 రోజుల్లోనే సు న్నం చెరువు పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. నీళ్లు తేటగా మారి జీవుల ఆవాసంగా మారింది. పాస్ఫేట్, క్లోరైడ్ నిల్వలు తగ్గాయి. దోమల బెడద తగ్గడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువును చూసి స్థానికులు ఇప్పుడు మురిసిపోతున్నారు.
ప్రాజెక్టు ఫలితాలు సంతృప్తినిచ్చాయి
చెరువులను బయో ఎంజైమ్ల ద్వారా శుద్ధి చేసే ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేపట్టాం. సున్నం చెరువును అందుకు ఎంపిక చేశాం. ట్రీట్మెంట్ ప్రారంభం రోజున అక్కడ నిలబడేందుకే ఇబ్బంది పడ్డాం. ఇప్పుడా పరిసరాలు ఆహ్లాదకరంగా మారాయి. ప్రాజెక్టు ఫలితాలు సంతృప్తినిచ్చాయి. చెరువు శుద్ధికోసం ఈపీటీఆర్ఐ, జేఎన్టీయూ ప్రొఫెసర్లు, పర్యాటకశాఖ ఎంతో సహకారం అందించాయి. ఇప్పుడు ఇతర అంశాలపైనా దృష్టిసారించాం. మిషన్ భగీరథ పథకం ద్వారా అందిస్తున్న శుద్ధ జలాలు, ప్రాజెక్టుల ద్వారా అందిస్తున్న సాగునీటి వినియోగం, సంరక్షణపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించాం.
– వీ ప్రకాశ్, చైర్మన్, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్