ఢిల్లీ : జీవితంలో తాను చెప్పింది ఆచరించిన గొప్ప మనిషి వ్యక్తి విద్యావేత్త, సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పూలే జయంతి ని పురస్కరించుకుని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పూలే చిత్ర పటానికి పలువురు వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులు తదితరులతో కలిసి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కుల వివక్ష పై ఆనాడే పోరాటం చేసిన మహానుభావుడు పూలే అని పేర్కొన్నారు. సమాజంలో సగ భాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని ఫూలే భావించాడు. వారి విద్యాభివృద్ధి కోసం పాఠశాలలు నిర్మించి విద్యా వ్యాప్తికి కృషి చేశాడన్నారు. 1864లో “బాలహత్య ప్రతిబంధక్ గృహ” స్థాపించి, వితంతువులు, గర్భిణీలకు అండగా నిలిచాడన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, ఐకమత్యంతో కూడిన సమసమాజం కోసీ జీవితాంతం పరితపించాడన్నారు. మహాత్మా పూలే ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని మంత్రి తెలిపారు.