లోకేశ్వరం/సోన్/లక్ష్మణచాంద, ఏప్రిల్ 24: కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం నగర్, లక్ష్మణచాంద మండలం రాచాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. నిర్మల్ మండలం అక్కాపూర్లో రూ.50 లక్షలతో నిర్మించనున్న రేణుకా మాత ఆలయ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా నిలుస్తున్నారని కొనియాడారు. మొదట్లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రైతుల పక్షాన ఢిల్లీలో పోరాటం చేసినా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. మత రాజకీయాలు చేసే బీజేపీ సర్కారు రైతులను మోసం చేసిందని మండిపడ్డారు.