హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): గ్రామ కార్యదర్శుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వారు విధుల్లో చేరేందుకు శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. విధులకు హాజరుకాని గ్రామ కార్యదర్శుల స్థానంలో కొత్తవారిని నియమించాలని నిర్ణయించింది. గతంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాసి వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించింది. వారు కూడా లేకుంటే ఆ గ్రామంలో డిగ్రీ చదివిన అర్హులను గ్రామసభ ఆమోదం ద్వారా నియమించుకోవాలని స్పష్టంచేసింది. పరిపాలన, పారిశుద్ధ్య పరమై న సమస్యలు తలెత్తకుండా వెంటనే ఈ చర్య లు తీసుకోవాలని సూచించింది.
గ్రామ కార్యదర్శుల సమ్మె నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల (డీపీవో)తో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విధుల్లో ఉన్న వారి జాబితాను శనివారం మధ్యాహ్నం కల్లా పంపించాలని ఆదేశించారు. సమ్మెలో ఉన్నవారు విధుల్లో చేరడానికి ముందుకొస్తే మధ్యాహ్నం 12 గంటల వరకు అవకాశం కల్పించి, వారి వినతిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కొత్త నియామకాల ప్రక్రియను పూర్తి చేసి సోమవారం విధుల్లో చేరేలా చూడాలని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లా, మండల స్థాయిలో ఏర్పాట్లుచేయాలని, సమన్వయం చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, పీఆర్ఆర్డీ డైరెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.