హైదరాబాద్ : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో తెలంగాణ టీవీ, డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన పాటను మంత్రి విడుదల చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
అనంతరం తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపిన గొప్పనేత సీఎం కేసీఆర్ అని అన్నారు. చలనచిత్ర, టీవీ పరిశ్రమల్లో లక్షలాది మంది జీవనం పొందుతున్నారని అన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వివిధ భాషలకు చెందిన కళాకారులకు అనేక అవకాశాలు లభిస్తున్నట్లు చెప్పారు.
‘ఒకప్పుడు చలనచిత్ర పరిశ్రమ అంటే చెన్నై పేరు గుర్తొచ్చేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్గా మారింది. ఇది మనకెంతో గర్వకారణం. ఇటీవలే కాలంలో ప్రజలు టీవీ సీరియల్స్ పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. చలనచిత్ర పరిశ్రమ, టీవీ ఫెడరేషన్లోని ఆర్టిస్ట్లు, టెక్నీషియన్స్లలో అర్హులైన వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద పెండ్లికి ఆర్థిక సహాయం, ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు అందించడం జరుగుతుంది. పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది. రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.