హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ): ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి, తమ కుటుంబాలను ఆదుకోవాలని టీఏటీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఊపిరి ఆపుకునే పరిస్థితులు వచ్చి నా ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని విమర్శించారు. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ ఉపేందర్ గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.
మారయ్య నాచారంలోని సంఘం కార్యాలయంలో మాట్లాడారు. పూట గడవక ఒక్కో ఆటో డ్రైవర్ తనువు చాలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15 వేల చొప్పున చెల్లించాలని కోరారు. ప్రభు త్వం స్పందించకుంటే భవిష్యత్తు కార్యాచరణను రూపొందించి, పోరాడుతామని స్పష్టం చేశారు. సమావేశంలో రమేశ్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.