Kalyana Lakshmi | హైదరాబాద్, మే18 (నమస్తే తెలంగాణ): కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిదారుల కోసం రూ.725 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 బడ్జెట్లో కేటాయించిన ఆయా నిధులను తాజాగా విడుదల చేసింది. కల్యాణలక్ష్మి పథకం కింద ఆడబిడ్డల పెండ్లి కోసం రూ.1,00,116 నగదుతోపాటు తులం బంగారాన్ని అందిస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
అయితే ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయలేదు. తులం బంగారం ఇచ్చే విషయమై బీసీ సంక్షేమశాఖ అధికారులు ఇప్పటికే పలు ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. దానిపై ఇప్పటివరకు సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో తులం బంగారం ఎప్పటి నుంచి అమలు చేస్తారో అనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.
కులాంతర వివాహాలు చేసుకున్న బీసీలకు ప్రోత్సాహకం అందజేసేందుకు ప్రభుత్వం రూ.2.50 లక్షలను మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాద వృత్తి చేపట్టిన బీసీలకు అందజేసే సబ్సిడీ కింద 25 లక్షలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.