Podu Lands | హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): గిరిజనులకు పోడుభూముల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. దశాబ్దాలుగా అటవీభూమిని సాగుచేసుకుంటున్న అర్హులైన గిరిజనులకు ఈనెల 24 నుంచి 30 వరకు అటవీహక్కు పత్రాలు ఇవ్వాలని గతనెలలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,845 గ్రామాలు, తండాలు, గూడేల పరిధిలోని ఆదివాసీ, గిరిజనుల ఆధీనంలోని 4,01,405 ఎకరాల పోడు భూములపై 1,50,224 రైతులకు అటవీ యాజమాన్యహక్కు పత్రాలు పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నది.
అటవీ యాజమాన్యహక్కు పత్రాలు స్వీకరించే పోడురైతులకు వచ్చే వానకాలం పంట నుంచే రైతుబంధు, రైతుబీమా పథకాలు వర్తింపచేయాలని సీఎం కేసీఆర్ సంబంధిత శాఖలను ఆదేశించారు. గిరిజన సంక్షేమశాఖ అర్హులైన పోడురైతుల వివరాలను వ్యవసాయశాఖకు అప్పగించింది. వ్యవసాయశాఖ క్షేత్రస్థాయిలో ఏఈవోల ద్వారా రైతులకు ఆయా బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేందుకు సిద్ధం అవుతున్నది. ఈనెల 24 నుంచి 30 వరకు ఏడురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో పోడురైతులకు అటవీహక్కు పత్రాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది.
పోడు లబ్ధిదారులు: 1,50,224
పంపిణీ చేసే పోడు విస్తీర్ణం: 4,01,405 ఎకరాలు
పోడురైతులకు అటవీహక్కు పత్రాల పంపిణీ: జూన్ 24, 2023 నుంచి జూన్ 30, 2023 వరకు