హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): మున్సిపాలిటీల నిర్వహణలో రాష్టా న్ని దేశంలోనే అగ్రస్థానంలో ఉండేవిధంగా చేయాలని ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రాష్ట్రంలో కనీసం 30 పట్టణాలకు స్వ చ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చేవిధంగా కృషి చేయాలని మున్సిపల్ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. దీనికోసం ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోవాలని నిర్ణయించారు. రాష్ట్ర మున్సిపల్ శాఖమంత్రి కే తారకరామారావు మార్గనిర్దేశానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
వీలైనంత త్వరగా అన్ని ఎఫ్ఎస్టీపీలు సిద్ధం
ర్యాంకులు సాధించడంలో ఓడీఎఫ్ ప్లస్ప్లస్ క్యాటగిరీలోకి పట్టణాలు మార డం ముఖ్యమని గుర్తించారు. రాష్ట్రంలో 142 పట్టణ స్థానిక సంస్థలు ఉండగా ఇందులో 42 పట్టణాలు ఓడీఎఫ్ ప్లస్ప్లస్ క్యాటగిరీకి చేరాయి. 70 ఓడీఎఫ్ ప్లస్, 30 ఓడీఎఫ్ విభాగంలో చేరాయి. రాష్ట్రంలోని మరిన్ని పట్టణాలు ఓడీఎఫ్ ప్లస్ప్లస్ చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ర్యాకింగ్లో ఎఫ్ఎస్టీపీలదే ప్రముఖ పాత్ర. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న అన్ని ఎఫ్ఎస్టీపీలను వీలైనంత త్వరగా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణాలు త్రీస్టార్ రేటింగ్ సాధించాలని స్పష్టం చేశారు. అవార్డులు సాధించిన పట్టణాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు ఇవ్వనున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆ పట్టణాలపై ప్రత్యేక దృష్టి
ఈ సంవత్సరం 16 స్వచ్ఛ సర్వేక్షణ్, మూడు ఇండియన్ స్వచ్ఛలీగ్ అవార్డులు సాధించిన 19 పట్టణాలు లక్ష లోపు జనాభా క్యాటగిరీలోనివే. లక్ష పైచిలుకు జనాభా ఉన్న పట్టణం ఒక్కటి కూడా లేదు. రాష్ట్రంలో 15 పట్టణాల్లో లక్షకు పైగా జనాభా ఉంది. సూర్యాపేట, నల్లగొండ, కామారెడ్డి, మిర్యాలగూడ, రామగుండం, ఆదిలాబాద్, సిద్దిపేట, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, సంగారెడ్డి, వికారాబాద్లో లక్ష నుంచి మూడు లక్షల లోపు జనాభా ఉంది. మూడు లక్షల నుంచి 10 లక్షల జనాభా క్యాటగిరీలో వరంగల్, నిజామాబాద్ పట్టణాలు, 40 లక్షల పైచిలుకు జనాభా క్యాటగిరీలో జీహెచ్ఎంసీ ఉంది. ఈసారి వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిర్ణయించారు.