హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 29 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా సీవీ ఆనంద్ను కొనసాగిస్తూ, ఆయనకు కొత్తగా ఏర్పాటు
చేసిన తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ జనరల్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఎం స్టీఫెన్ రవీంద్రను కొనసాగిస్తూనే కొత్తగా ఏర్పాటుచేసిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీ బాధ్యతలు అప్పగించింది. ఉమెన్ సేఫ్టీ, షీ టీమ్స్, భరోసా అడిషనల్ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన స్వాతి లక్రాను టీఎస్ఎస్పీ బెటాలియన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్గా బదిలీ చేసింది. ఆమె స్థానంలో షికా గోయల్ను నియమించింది. విజయ్కుమార్ను గ్రేహౌండ్స్, అక్టోపస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్గా నియమించింది. బీ శివధర్రెడ్డిని రైల్వే, రోడ్డు సేఫ్టీ అడిషనల్ డైరెక్టర్గా, కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఆర్గనైజేషన్ అండ్ లీగల్ అడిషనల్ డైరెక్టర్ జనరల్గా నియమించింది. నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరిని నల్లగొండ ఎస్పీగా కొనసాగిస్తూనే యాదాద్రి డీఐజీగా ప్రభుత్వం నియమించింది.