Tealngana | హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో తెలంగాణలో ఆధ్యాత్మిక పరిమళం వెల్లివిరుస్తున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల పునరుద్ధరణకు నడుం బిగించింది. బాసర, ధర్మపురి, వేములవాడ, కాళేశ్వరం, కొండగట్టు తదితర ప్రధాన ఆలయాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇతర ముఖ్యమైన ఆలయాల్లో సైతం రోడ్లు, సత్రాలు, మంచినీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. వీటితోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాల్లో సైతం నిత్యం ధూప, దీప నైవేద్యాలు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఆలయాల్లో ఆన్లైన్ సేవలు
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఆలయాల్లో కనీస సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నారు. స్థానిక ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ అభివృద్ధి కమిటీలు సంయుక్తంగా ప్రణాళికలు రూపొందించి పనులు చేపడుతున్నాయి. దీనికి అవసరమైన నిధులను దేవాదాయశాఖ మంజూరు చేస్తున్నది. దాతలు అందజేసిన విరాళాలతో సత్రాల నిర్మాణం, అన్నదాన కార్యక్రమాలు, మంచినీటి సౌకర్యం తదితర పనులు చేపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆలయాల్లో పలురకాల ప్రసాదాలను కూడా తయారు చేయించి పంపిణీ చేస్తున్నారు. పూజలు, అర్చనలు, ఇతర సేవలను ముందుగా బుకింగ్ చేసుకునేందుకు ఆన్లైన్ విధానాన్ని చేపట్టారు. ఆలయ భూముల పరిరక్షణలో భాగంగా అన్యాక్రాంతమైన దాదాపు 5,050 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నారు. భవిష్యత్తులో ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు సైన్బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.
ఆధ్యాత్మిక యాత్రలకు ఆదరణ
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడంతో విహారయాత్రలకు బదులు ఆధ్యాత్మిక యాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సెలవు దినాల్లో రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిటకిట లాడటమే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్ నుంచి బయలుదేరి రెండు రోజుల్లోనే యాదగిరిగుట్ట, వరంగల్ వేయి స్తంభాలగుడి, కాళేశ్వరం, కొండగట్టు, ధర్మపురి, బాసర, వేములవాడ తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వీలుండటంతో చాలామంది సెలవు దినాల్లో ఇటువంటి ఆధ్యాత్మిక యాత్రలకు మొగ్గుచూపుతున్నారు.
యాదగిరిగుట్ట ఆలయాన్ని రోజుకి సగటున 45 వేల నుంచి 50 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. వేములవాడ రాజరాజేశ్వర ఆలయం, భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయం, బాసర, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలకు ఇతర రాష్ర్టాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలోని కురుమూర్తి ఆలయాన్ని సైతం అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవల రూ.1.20 కోట్లతో నిర్మించిన రాజగోపురాన్ని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రారంభించారు.