Dharani | హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ‘ధరణి’ పోర్టల్ సేవలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిసింది. రిజిస్ట్రేషన్లు మినహా ఇతర సేవలన్నింటినీ ఆపేయాలంటూ రెవెన్యూ శాఖ నుంచి అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామన్న సీఎం రేవంత్రెడ్డి.. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ధరణి పనితీరు, పోర్టల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? వాటిని ఏ విధంగా పరిష్కరించాలి? తదితర వివరాలపై 10 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
‘ధరణి’ ద్వారా రిజిస్ట్రేషన్లు సులువుగా జరుగుతున్న విధానాన్ని సీఎం అభినందించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కొత్త పోర్టల్ తేవాలా? లేక ‘ధరణి’లోనే మార్పులు, చేర్పులు చేసి పేరును మార్చాలా? అనే అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. భూ సంబంధ సమస్యలు, పరిష్కారంపై స్పష్టత వచ్చే వరకు ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్లు, నాలా కన్వర్షన్లు మినహా ఇతర సేవలన్నింటినీ నిలిపివేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తున్నది.