హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : సర్కారు బడుల్లో డిజిటల్ విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు స్కూళ్లల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లను బిగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రస్తుతం 13,983 ప్యానళ్లను అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్యానళ్లను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (టీఎస్టీఎస్ఎల్) టెండర్ల ద్వారా సేకరించి బడులకు చేర్చాలని భావిస్తున్నది. రాష్ట్రంలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద మొత్తం 12 అంశాలను తీసుకొని స్కూళ్ల స్వరూపాన్ని మార్చుతుండగా, ఇందులో డిజిటల్ విద్యను సైతం ఒక అంశంగా చేర్చారు.
తరగతి గది బోధన తీరు రోజురోజుకు మారుతున్నది. విద్యార్థులను నిమగ్నం చేసేందుకు అనేక రకాల సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. కరోనా తదనంతర పరిస్థితుల్లో డిజిటల్ బోధన విస్తృతమైంది. బోధనను మరింత సరదాగా, ఇంటరాక్టివ్గా మార్చేందుకు ఇదివరకు ప్రొజెక్టర్లు, డిజిటల్ తెరలను వాడారు. వీటికి బదులుగా సరికొత్తగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు అందుబాటులోకి వచ్చాయి. మనం ట్యాబ్లను, స్మార్ట్ఫోన్లను వినియోగించినంత తేలికగా వీటిని ఉపయోగించి అత్యంత సులభంగా పాఠ్యాంశాలను బోధించవచ్చు.