హైదరాబాద్/ జగిత్యాల, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు జీవో 49జారీ చేశారు. ఉత్తర తెలంగాణలో ప్రశస్తమై, భక్తుల కొంగు బంగారమైన అంజన్న ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల కావడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. గత ఏడాది డిసెంబర్ 7న సీఎం కేసీఆర్ జగిత్యాలలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వచ్చారు. ఆ సమయంలో మోతె గ్రామ శివారులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తామని, కొండగట్టును సైతం యాదగిరిగుట్ట తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం రెండు నెలల వ్యవధిలోనే కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లను మంజూరు చేశారు. ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలు పంపించాలని కలెక్టర్ను ఆదేశించారు.
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆధ్యాత్మిక క్షేత్రం కొండగట్టు దేవాలయానికి తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంజన్న భక్తులకు అత్యున్నత సౌకర్యాలు కల్పించడంసహా దేవాలయంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నామని చెప్పారు. ప్రతి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అత్యున్నత స్థాయిలో సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని ఆమె కొనియాడారు.
కొండగట్టు దేవస్థానం అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయడంపై సీఎం కేసీఆర్కు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. స్వరాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కోట్లాది నిధులు మంజూరు చేస్తున్న ఘనత కేసీఆర్కు దక్కుతున్నదని కొనియాడారు. గత ప్రభుత్వా ల హయాంలో ఆలయాలను చిన్నచూపు చూ శారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో కొండగట్టు దశదిశ సైతం త్వరలోనే మారిపోనున్నదని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హిందుత్వం ముసుగు వేసుకున్నాడే తప్ప ఏనాడూ ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించలేదని విమర్శించారు. నిధుల మంజూరుకు సహకరించిన మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సీఎం కేసీఆర్ హామీ ప్రకారం కొండగట్టు పు ణ్యక్షేత్రం అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరుచేయడంపై జిల్లావ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతున్నది. కొండగట్టు గుట్టపైన, కొండగట్టు దిగువన హన్మాన్ భక్తులు, ప్రజలు సంబురాలు చేసుకొన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. కొడిమ్యాలలోనూ సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి సంబురాలు జరుపుకున్నారు.