హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడిని 4 వారాల్లోగా నియామిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులపై సందేహాలు ఉన్నందునే ఈ నియామక ప్రక్రియ పూర్తికాలేదని, ఆ సందేహాలను నివృత్తి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే తుది నిర్ణయం తీసుకోలేదని మంగళవారం హైకోర్టుకు వివరించింది.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్కుమార్ ధర్మాసనం స్పందిస్తూ.. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించాల్సిందేనని పేర్కొన్నది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన వివరాలను నమోదు చేసుకుని తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.