Congress | హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఊరించిన కాంగ్రెస్ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. కేవలం ఒక్కరోజు ముందు హడావుడిగా కసరత్తు మొదలుపెట్టిన ప్రభుత్వం బుధవారం సాయంత్రానికి కల్లా ఖాళీల వివరాలు అందజేయాలని ప్రభుత్వశాఖలను ఆదేశించింది. దీంతో 100 పోస్టులు ఉన్నట్టు అధికారులు లెక్క తేల్చినట్టు సమాచారం. గ్రూప్-1 నోటిఫికేషన్ను 2022లో కేసీఆర్ ప్రభుత్వం జారీచేసింది. అప్పట్లో 503 పోస్టులతో నోటిఫికేషన్ వెలువడగా 2.33 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
దీంతో తాజాగా గుర్తించిన 100 పో స్టులకు ఆర్థికశాఖ గ్రీన్సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత శాఖల వారీగా ఇండెంట్లు, పోస్టు ల భర్తీకి అర్హతలు, నిబంధనలు వంటి అంశా లు టీఎస్పీఎస్సీకి చేరుతాయి. ఆ తర్వాతే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీచేస్తుంది. కొత్తగా చేర్చే పోస్టులకు అదనపు నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు టీఎస్పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు కనీసం వారం, పది రోజులు పడుతుందని అధికారవర్గాలు చెప్తున్నాయి.