Irrigation Department | హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సాగునీటి పారుదలశాఖకు సెక్రటరీ ఎవరు? ఆ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రజత్కుమార్ నవంబర్ 30న ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో పంచాయతీరాజ్ సెక్రటరీగా ఉన్న స్మితాసబర్వాల్కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించినా.. ఆమె ఆ విధులకు దూరంగా ఉంటున్నారు. అదనపు బాధ్యతలు స్వీకరించిన అనంతరం స్మితా డిసెంబర్ 3 వరకు క్రియాశీలకంగా ఉన్నప్పటికీ, ఆ తరువాత ఆమె కార్యాలయానికి రావడం లేదు. సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిర్వహించిన తొలి సమీక్షలోగానీ, ఇటీవల జరిపిన మేడిగడ్డ పర్యటనలో స్మిత కనిపించలేదు. సెలవు కూడా పెట్టలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ సెక్రటరీ ఎవరనే చర్చ జోరుగా కొనసాగుతున్నది.
సాగునీటి పారుదలశాఖ కార్యదర్శి నియామకంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ పలు ప్రాజెక్టుల రీడిజైన్, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమర్థుడైన అధికారిని నియమించాలని కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం కేంద్ర సర్వీసులో ఉన్న ఇద్ద రు అధికారులను సంప్రదించినట్టు తెలిసింది. ఒకరు అనాసక్తి చూపగా, మరొకరు ఏడాది తరువాత వస్తానని చెప్పినట్టు ఇంజినీర్లు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్వీసులోని అధికారులను కూడా పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
స్మితసభర్వాల్ దీర్ఘకాలంగా విధులకు దూరంగా ఉండటంతో ఫైళ్లు పేరుకుపోతున్నాయి. దీంతో ఇంజినీర్లు తలలు పట్టుకుంటున్నారు. ఉద్యోగులకు సంబంధించిన అనేక అంశాలు కూడా పెండింగ్లో పడిపోయాయి. కీలకాంశాలకు సంబంధించి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలంటే కార్యదర్శి ద్వారానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మేడిగడ్డ ఘటనకు సంబంధించి ఇంజినీర్లు తర్జనభర్జన పడుతున్నారు. కీలకమైన కృష్ణా ట్రిబ్యునల్ విచారణ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. నాగార్జునసాగర్ డ్యామ్ను ఏపీ ఆక్రమంగా ఆక్రమించి స్వాధీనం చేసుకున్న వివాదం ఓవైపు నడుస్తున్నది. ఇక కేంద్ర సంస్థల నుంచి వచ్చే లేఖలకు సమాధానం ఇచ్చేవారు లేకుండాపోయారు. భూసేకరణ కోర్టు కేసులు, రోజువారీ ఫైళ్ల కదలికలు పూర్తిగా స్తంభించిపోయాయని అధికారులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కార్యదర్శిని నియమించాలని కోరుతున్నారు.