HomeTelanganaThe Government Has Given A Sweet Talk To The Contract Teachers Working In Telangana Social Welfare Gurukula Schools
గురుకుల టీచర్లు ఇక రెగ్యులర్
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారిని రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయిం తీసుకొన్నది. మొత్తంగా 567 మంది ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించేందుకు ఆమోదం తెలిపింది.
567 మంది కాంట్రాక్టు టీచర్ల క్రమబద్ధీకరణ
వీరిలో 507 మంది మహిళా టీచర్లే
16 ఏండ్ల నిరీక్షణకు సర్కారు తెర
వీరికి ఇప్పటికే రెగ్యులర్ టీచర్లతో సమాన వేతనం
సెలవులను మంజూరు చేస్తున్న ప్రభుత్వం
ఉపాధ్యాయులు, గురుకుల ఉద్యోగుల హర్షం
ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారిని రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయిం తీసుకొన్నది. మొత్తంగా 567 మంది ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించేందుకు ఆమోదం తెలిపింది. 2007లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో వీరిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేయించిన నాటి ప్రభుత్వం, వేతనాలను మాత్రం సమానంగా ఇవ్వలేదు. 10 నెలల వేతనాన్ని మాత్రమే చెల్లించింది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సెలవులను కూడా ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ మానవీయకోణంలో గురుకులాల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయులకు రెగ్యులర్ ఉపాధ్యాయులతోపాటు పీఆర్సీని అమలు చేశారు. అదీగాక 12 నెలల పూర్తి వేతనాన్ని చెల్లించాలని నిర్ణయించడంతోపాటు, ఆ మేరకు 2007 నుంచి ఉన్న బకాయిలను కూడా చెల్లించారు. అంతేగాకుండా రెగ్యులర్ గురుకుల ఉపాధ్యాయులతో సమానంగా సెలవులను కూడా మంజూరు చేశారు.
507 మంది మహిళలే..
ప్రభుత్వం తాజాగా రెగ్యులరైజ్ చేస్తున్న 567 మంది టీచర్లలో 507 మంది మహిళలే కావడం విశేషం. ప్రభుత్వ నిర్ణయంపై టీచర్లు సంతోషం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. గురుకుల కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయటం ప్రభుత్వ ఉదారతకు నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవి, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టాఫ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఏవీ రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభుదాస్, చైర్మన్ వెంకటేశ్వర్లు, మహిళా విభాగం కార్యదర్శి శ్రీలత, ప్రిన్సిపాల్స్ సంఘం సలహాదారుడు తీగల అంజయ్య, తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు, ప్రధాన కార్యదర్శి దయాకర్ వేర్వేరు ప్రకటనల్లో కొనియాడారు. రెగ్యులరైజ్ చేసిన సీఎం కేసీఆర్కు, అందుకు కృషి చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్, గురుకుల సెక్రటరీ నవీన్ నికోలస్కు ప్రత్యేక ధన్యావాలు తెలియజేశారు. కాంట్రాక్ట్ టీచర్లకు మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. క్రమబద్దీకరణకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటిరెండు రోజుల్లో జారీచేస్తామని వెల్లడించారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
కాంట్రాక్టు టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. సమ్మెలు చేశాం. అయినప్పటికీ ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. కానీ సీఎం కేసీఆర్ మానవీయకోణంలో ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారు. ఇప్పటికే రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా కాంట్రాక్ట్ టీచర్లకు వేతనాలను, సెలవులను మంజూరు చేశారు. ఇప్పుడు పూర్తిగా క్రమబద్ధీకరించాలని నిర్ణయించడంతో ఆనందంగా ఉన్నది. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– ప్రభుదాస్, ప్రధాన కార్యదర్శి (టీఎస్డబ్ల్యూఆర్ఈఐ స్టాఫ్ అసోసియేషన్)
సీఎం కేసీఆర్ మానవీయతకు మారుపేరు
సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు ఉపాధ్యాయులు, సిబ్బంది సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరిస్తున్నది. ఇప్పటికే అనేక విధాలుగా కాంట్రాక్టు ఉపాధ్యాయులు, సిబ్బందికి వసతులు కల్పించింది. రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా వేతనాలను పెంచడంతోపాటు, సెలవులను మంజూరు చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వమే కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల వేతనాన్ని ఇవ్వాలని నిర్ణయించడంతోపా గత బకాయిలను కూడా చెల్లించింది. ఇప్పుడు 567 మంది కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రతను కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ నిర్ణయం సాంఘిక సంక్షేమ గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించి, దళిత విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి తప్పకుండా తోడ్పడుతుంది.
– బాలరాజు, రాష్ట్ర అధ్యక్షుడు (టీఎస్డబ్ల్యూఆర్టీఈఎస్)