హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 21 నుంచి నాలుగు రోజులపాటు జరిగే మేడారం మహాజాతర సమయంలోనే కోయ ఇలవేల్పుల సమ్మేళనం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ కసరత్తు చేస్తున్నది. మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా జాతరకు రెండు నెలల ముందే అధికారులు 2018 నుంచి 2022 వరకు కోయ ఇలవేల్పుల సమ్మేళనం నిర్వహిస్తూ వచ్చారు.
ఈసారి అలా కాకుండా జాతర సమయంలోనే సమ్మేళనం నిర్వహిస్తే గిరిజన సాంస్కృతిక వైభవం ఇతర భక్తులకు తెలిసే అవకాశం ఉంటుందని స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఇటీవలి సమీక్షలో అధికారులకు సూచించారు. దాంతో గిరిజన సంక్షేమశాఖ ఏర్పాట్లకు కసరత్తు చేస్తున్నది.
మేడారంలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ మ్యూజియంలో కోయల ఇలవేల్పుల సమ్మేళనం నిర్వహించేవారు. కోయ ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ఇలవేల్పుల (ఇంటిదైవాలు) ప్రదర్శన, మొక్కులు, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా సమ్మేళనం నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న కోయ గిరిజనుల్లో ఇప్పటి వరకు 150 ఇలవేల్పులు ఉంటాయని అంచనా. ఇప్పటి వరకు కోయ గిరిజన సమ్మేళనంలో 20 కంటే ఎక్కువ ఇలవేల్పుల ప్రదర్శన జరగలేదు.
ఆదివాసీ కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు ఉట్టిపడేలా నిర్వహించే ఈ సమ్మేళనంలో పాల్గొనాలంటే ముందుగా ఆయా కోయగూడెల్లో ఉన్న ఇలవేల్పుల కొలుపులకు సంబంధించి కట్టుబాట్లను నిష్ఠతో అనుసరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మిగితా వాళ్లు తమ ఇలవేల్పులను పొలిమేరలు దాటించరని, ఈ కారణంగా ఎక్కువ ఇలవేల్పుల ప్రదర్శన జరగటం లేదనే వాదన ఉన్నది.