హైదరాబాద్ : భవిష్యత్ కాలంలో విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరి అవుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో ఈవీ ట్రేడ్ ఎక్స్పో విద్యుత్ వాహనాల ప్రదర్శనను హైటెక్స్లో జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..10 వేల విద్యుత్ మోటర్ సైకిల్స్ వినియోగంలోకి వచ్చినట్లైతే సంవత్సరానికి 250 కోట్ల రూపాయల పెట్రోల్ దిగుమతులు ఆదా చేసినవారమౌతామన్నారు. ప్రపంచానికి పర్యావరణ కాలుష్యం ఛాలెంజ్ గా మారిన నేపథ్యంలో విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరైందని ఆయన చెప్పారు.
పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ శాఖ మంత్రి కేటీఆర్ విద్యుత్ వాహనాలను ప్రోత్సాహించడంతో పాటు వాహనాలు తయారీ చేస్తున్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యుత్ వాహనాల అమ్మకాలను మాత్రమే కాకుండా ఇక్కడే తయారీ చేసే విదంగా పారిశ్రామిక వేత్తలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందన్నారు.
అంతే గాకుండా విద్యుత్ వాహనాలకు అవసరమైన బ్యాటరీ పరిశ్రమలను తెలంగాణలో నెలకొల్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన రాయితీలు ఇచ్చి మరీ ఎంకరేజ్ చేస్తుందన్నారు. వాడకంలోకి వచ్చిన విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కు సందేహ పడొద్దని, ఇప్పటికే 138 ఛార్జింగ్ కేంద్రాలను ప్రారంభించినట్లు, మరో 600 ఛార్జింగ్ కేంద్రాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణా రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఉన్నందున ఏ ఒక్కరూ విద్యుత్ వాహనాల ఛార్జింగ్ విషయంలో భయపడొద్దని మంత్రి జగదీష్ రెడ్డి భరోసా ఇచ్చారు.