హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు వార్షిక బడ్జెట్లో రాష్టప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇక నుంచి స్థానిక సంస్థలకు ప్రభుత్వం నుంచి విడుదల చేసే నిధులను నేరుగా ఆయా సంస్థల బ్యాంకు అకౌంట్లో జమ చేయాలని నిర్ణయించింది. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల నిధులు పక్కదారి పడుతున్నాయన్న ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సోమవారం ఈ మేరకు ప్రకటించారు. ఇప్పటివరకు స్థానిక సంస్థలకు విడుదల చేసే నిధులను ట్రెజరీల ద్వారా విడుదల చేస్తున్నారు.
ఈ ప్రక్రియతో నిధులను స్థానిక సంస్థలు డ్రా చేసుకోవడానికి కొంత సమయం పడుతున్నది. ఈ జాప్యాన్ని నివారించేందుకు ప్రతి స్థానిక సంస్థతో ప్రత్యేకంగా అకౌంట్ ఓపెన్ చేయించి ఆయా ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తారు. దీని ద్వారా హైదరాబాద్లో నిధులు విడుదల చేసిన మరుక్షణం వారి ఖాతాలో అందుబాటులో ఉంటాయి. ఈ విధానం వల్ల ఎలాంటి జాప్యం లేకుండా స్థానిక సంస్థలు చేసిన పనులకు బిల్లులు చెల్లించే వీలు కలుగుతుందని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కోసం స్థానిక సంస్థలకు పెద్ద ఎత్తున నిధులను విడుదల చేస్తున్నది. ప్రభుత్వ నిర్ణయంపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
సాహసోపేత నిర్ణయం
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. గతంలో చెక్కులు జారీ చేసినా ఒక్కోసారి ట్రెజరీల ద్వారా క్లియర్ కావడానికి కొంత సమయం పట్టేది. తాజా నిర్ణయంతో జాప్యానికి తావుండదు. గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకొని చెక్కులు ఇచ్చిన వెంటనే నిధులు డ్రా చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇది శుభ పరిణామం. ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి సంస్కరణ ఇది.
–పీ మధుసూదన్రెడ్డి, పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
మంచి నిర్ణయం
సీఎం కేసీఆర్ చాలా మంచి ఆలోచన చేశారు. మా సర్పంచ్లందరి తరుఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నా. గతంలో ప్రభుత్వం నిధులు విడుదల చేసినా ఎస్టీవోలు, డీటీవోల ద్వారా విడుదల కావాల్సి ఉండేది. దీంతో ఆ ప్రక్రియకు కొంత సమయం పట్టేది. దీని వల్ల సర్పంచ్లు, అధికారులు కొంత ఇబ్బందులు పడ్డారు. బ్యాంకుల్లో నిధులు జమ చేయడం ద్వారా ఎలాంటి జాప్యం కాదు.
– గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి. సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కడ్తాల్ గ్రామ సర్పంచ్. రంగారెడ్డి జిల్లా