హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నిరంగాల ఉద్యోగులను అక్కున చేర్చుకొన్న రాష్ట్ర ప్రభుత్వం, అంగన్వాడీలకు కూడా కండ్లల్లో పెట్టుకొని కాపాడుతున్నది. రాష్ట్రంలోని 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, సహాయకులు, మినీ అంగన్వాడీల వేతనాలు పెంచుతూ, ఇతర సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ భరోసా ఇస్తున్నది. గత నెలలోనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెంచింది. దీంతో అంగన్వాడీలు, సహాయకులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. సీఎం కేసీఆర్ మనసున్న వ్యక్తి అని తమ విషయంలో కూడా నిరూపించుకొన్నారని కొనియాడుతున్నారు. గతంలో తమను వర్కర్లుగా సంబోధిస్తూ అగౌరవపరచిన ప్రభుత్వాలనే చూశామని, తెలంగాణ రాష్ట్రం వచ్చాకే టీచర్ అని గౌరవంగా పిలుస్తున్నారని ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వేతనాలు పెంచాలని కోరినందుకు గుర్రాలతో తొక్కించి తరిమికొట్టారని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అడగ్గానే వేతనాలు పెంచుతూ తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30 శాతం పీఆర్సీ ఇచ్చి గౌరవించారని గుర్తుచేస్తున్నారు. అంగన్వాడీల సేవలను గౌరవిస్తూ ఇటీవలే పదవీ విరమణ బెనిఫిట్స్ను ప్రకటించింది. అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష, సహాయకులకు రూ.50 వేలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. మినీ అంగన్వాడీలను కూడా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది.
అంగన్వాడీలకు వేతనాల పెంపు ఇలా..(రూ.ల్లో)
పట్టించుకోని కేంద్రం-పట్టం కట్టిన రాష్ట్రం
అంగన్వాడీల వేతనాలు ఏ రాష్ట్రంలో ఎంత? (రూ.ల్లో)
ప్రభుత్వంపై విశ్వాసం ఉన్నది
తెలంగాణ ఏర్పడిన తర్వాత అంగన్వాడీలకు సీఎం కేసీఆర్ మూడుసార్లు వేతనాలు పెంచారు. ఆగస్టు 25వ తేదీన రిటైర్మెంట్ బెనిఫిట్స్గా టీచర్స్కు రూ.లక్ష, సహాయకులకు రూ.50 వేలు ప్రకటించారు. ఈ విషయాలను విస్మరించి రెండు సంఘాలు సమ్మె చేస్తున్నట్టు ప్రకటించాయి. అంగన్వాడీలకు ఇంకా కొన్ని సమస్యలున్న మాట నిజమే. వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ను కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. సీఎం కేసీఆర్ సమస్యలను పరిష్కరిస్తారని మాకు విశ్వాసం ఉన్నది.
-నల్లా భారతి, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు
ధర్నాలు వద్దు.. విన్నపాలే ముద్దు
రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసిన ఘనత సీఎం కేసీఆర్దే. ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి మూడుసార్లు వినతిపత్రాలు ఇచ్చినా మినీ అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కాలేదు. కానీ, సీఎం కేసీఆర్ మనల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి వేతనాలు పెంచారు. 8 సంవత్సరాలుగా ప్రభుత్వానికి సామరస్యంగా పోరాడి మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసుకున్నాం. ఎమ్మెల్సీ కవిత గౌరవ అధ్యక్షురాలిగా మినీ అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. గతంలో ఏనాడూ మినీ అంగన్వాడీ టీచర్లను పట్టించుకోని కొన్ని సంఘాలు నేడు ధర్నాలు చేస్తేనే సమస్యలు పరిషారమవుతాయని మభ్యపెడుతున్నాయి. ఆ సంఘాల మాటలు నమ్మొద్దు. ధర్నాలు వద్దు.. విన్నపాలే ముద్దు అన్న రీతిలో మా సమస్యలను పరిష్కరించుకున్నాం. ఇప్పుడూ అదేదారిలో వెళతాం. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు.
-ఆడెపు వరలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు