హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): మహిళలకు అన్ని రంగాల్లో సముచిత ప్రాధాన్యం కల్పించాలనే సంకల్పంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పారిశ్రామికవాడ ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా విరాజిల్లుతున్నది. 25 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇక్కడ వివిధ రకాల ఉత్పత్తులను తయారుచేస్తూ ఎందులోనూ తీసిపోమని మరోసారి నిరూపించారు. తాము ఉపాధి పొందటమే కాకుండా పెద్ద సంఖ్యలో తోటి మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నారు. 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ ఇండస్ట్రియల్ పార్క్లో రూ.300 కోట్లకుపైగా పెట్టుబడులు రావడం విశేషం.
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో ఎఫ్ఎల్వో(ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్)కు 50 ఎకరాలు కేటాయించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా నూరుశాతం మహిళా పారిశ్రామికవేత్తలే పరిశ్రమలు ఏర్పాటు చేసేలా దీన్ని రూపొందించారు. గత ఏడాది మహిళాదినోత్సవం రోజున రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఇండస్ట్రియల్ పార్క్ను లాంఛనంగా ప్రారంభించారు. ఒక్కో కంపెనీకి సగటున రెండు ఎకరాల చొప్పున మొత్తం 25 కంపెనీలకు ఇందులో భూములు కేటాయించగా, ప్రస్తుతం కంపెనీలన్నీ ఉత్పత్తి ప్రారంభించాయి. ఇక్కడ తయారవుతున్న ఉత్పత్తులు నగరంలోనే విక్రయిస్తున్నారు.
-ఎఫ్ఎల్వో మాజీ అధ్యక్షురాలు జ్యోత్స్న అంగారా
ఇండస్ట్రియల్ పార్క్ ఉత్పత్తులు
ఫుడ్ ప్రాసెసింగ్, న్యూట్రాస్యూటికల్స్, ఆటో ఇంజినీరింగ్ విడిభాగాలు, కెపాసిటర్స్, ప్రీకాస్ట్ బ్లాక్స్, మల్టీ లెవల్ పార్కింగ్ ఎలివేటర్స్, లిఫ్టులు, గార్మెంట్స్, ఫర్నీచర్, ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, ఎల్ఈడీ లైట్లు, ప్యాకేజింగ్ మెటీరియల్, మెడికల్ డివైజెస్.