హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 23 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో రెండు విడతల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియపై శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో సమీక్ష నిర్వహించారు. మొదటి రెండు విడతల్లో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి 24,900 మందికి ఇండ్లను పంపిణీ చేసినట్టు మంత్రి తెలిపారు.
ఈ క్రమంలో రెండు, మూడు విడతల కింద మరో 21 వేల మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేసేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల 27న హైదరాబాద్ కలెక్టరేట్లో ర్యాండమైజేషన్ విధానంలో ఆన్లైన్ డ్రా నిర్వహిస్తామని చెప్పారు. ఎంపికైన లబ్ధిదారులకు వచ్చే నెల 2న 11,500 మందికి, 5న మిగిలిన 11,500 మందికి పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా, పార్టీలకు అతీతంగా ఇండ్లను పంపిణీ చేసే ప్రక్రియ కొసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.