పెబ్బేరు, డిసెంబర్ 18: జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని పంటలకు నీరందించాలని వనపర్తి జిల్లా పెబ్బేరు మం డలం రైతులు సోమవారం స్థానిక ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వారికి బీఆర్ఎస్ నాయకులు మద్దతిచ్చారు. డీ-19 కాల్వ కింద పెంచికలపాడు, జనుంపల్లి, మునగమాన్దిన్నె, సూగూరు, కొత్తసూగూరు, పలు గ్రామాల పరిధిలో సుమారు 2 వేల ఎకరాల్లో మిరప, ఇతర పంటలను సాగు చేసినట్టు రైతులు తెలిపారు.
పంట చేతికొస్తున్న దశలో జూరాల అధికారులు వారం రోజులుగా నీటి సరఫరాను నిలిపివేశారని మండిపడ్డారు. వారబంది ప్రకారం ఫిబ్రవరి 15 వరకు జూరాల నీరు విడుదల చేయాల్సి ఉందని గుర్తుచేశారు. ఎస్ఈ సత్యశీలారెడ్డికి వినతిపత్రం అందజేయగా.. నీటిని విడుదల కు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.