Nagarjuna Sagar | నల్లగొండ ప్రతినిధి, జనవరి 1 (నమస్తే తెలంగాణ): నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు మళ్లీ బోర్లు, బావుల తవ్వకంపై దృష్టిసారించారు. ఈ ఏడాది ఎగువ నుంచి రిజర్వాయర్కు చుక్కనీరు రాకపోవడంతో ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడింది. వానకాలంలో కురిసిన వర్షాలతో రైతులు సాగుకు ఉపక్రమించగా చివరి దశలో కేసీఆర్ సర్కార్ పంటలను కాపాడేందుకు నీరు విడుదల చేయడంతో రైతులు గట్టెక్కారు. ప్రస్తుతం యాసంగి సీజన్లో సాగునీటి విడుదలకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. రిజర్వాయర్లో కేవలం 12 అడుగుల మేర మాత్రమే నీరు అందుబాటులో ఉండటం..అది వచ్చే వేసవిలో తాగునీటి అవసరాలకే సరిపోయేలా లేదు. దీంతో ఈ సీజన్లో ఎడమ కాల్వ ద్వారా నీటి విడుదల లేనట్టేనని తెలుస్తున్నది. క్రాప్ హాలిడే అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించికపోయినా అనధికారికంగా అదే పరిస్థితి కొనసాగుతున్నది. దీంతో రైతులంతా ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించారు. ఆర్థికంగా ఉన్న రైతులు కొత్తగా బోర్లు వేయడంతోపాటు బావులు తవ్వించే పనిలో ఉన్నారు. మరికొందరు ఇప్పటికే ఉన్న పాత బావుల్లో పూడికలు తీస్తున్నారు.
తెలంగాణ ఆవిర్భవించాక తొలిసారిగా నాగార్జునసాగర్ ఆయకట్టులో రైతులకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. కృష్ణా బేసిన్లో సరైన వర్షాలు కురువక ఎగువన శ్రీశైలం పూర్తిగా నిండలేదు. దీంతో నాగార్జునసాగర్కు వరద రాకపోవడంతో ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. సాగర్లో ప్రస్తుతం ఉన్న నీళ్లు తాగునీటి అవసరాలకు సరిపడే పరిస్థితి కూడా లేదు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 522.80 (154.43టీఎంసీలు) అడుగుల మేర నీరు ఉన్నది. సాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ 510 అడుగులు. డెడ్ స్టోరేజీ కంటే అదనంగా 12 అడుగుల నీరు మాత్రమే రిజర్వాయర్లో అందుబాటులో ఉన్నట్టు లెక్క. ప్రభుత్వం అనధికారికంగా పంటలకు నీరిచ్చే పరిస్థితి లేదని సంకేతాలు ఇస్తున్నది. సాగర్ కుడి, ఎడమ కాల్వలకు సాగునీటిని విడుదల చేయలేమని రైతులు రబీలో క్రాప్ హాలిడేగా పాటించాలని ఇటీవల ఎన్నెస్పీ చీఫ్ ఇంజినీర్ అజయ్కుమార్ సూచించారు.
స్వరాష్ట్రంలో వ్యవసాయానికి కేసీఆర్ సర్కార్ ఇచ్చిన తోడ్పాటుతో రైతులు పంటల సాగులో దూసుకుపోయారు. సమృద్ధిగా సాగునీరు, నిరంతర ఉచిత కరెంట్, రైతుబంధు, పంటల కొనుగోళ్లతో ఎలాంటి ఇబ్బంది లేకుండాపోయింది. ఈ వానకాలంలో సన్న వడ్లకు క్వింటాల్కు రూ.3 వేల వరకు ధర పలకడంతో రైతులు యాసంగిలోనూ సాగుకు ఉపక్రమిస్తున్నారు. అయితే, సాగర్ నుంచి సాగునీటి విడుదలకు అవకాశాలు లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం ఆయకట్టు పరిధిలో బోరుబండ్ల హడావుడి కొనసాగుతున్నది. రైతులు కొత్తగా బోర్లు వేస్తూ భగీరథ యత్నాలు సాగిస్తున్నారు. మరికొందరు రైతులు కొత్తగా బావులు తవ్విస్తున్నారు. ఇంకొందరు పాత బావుల్లో పూడికలు తొలిగించే పనిలో నిమగ్నమయ్యారు. ఎలాగైనా సరే భూములు పడావు పెట్టకుండా వరి సాగు చేయాలన్న సంకల్పం కనిపిస్తున్నది. ఇలా బోర్లు, బావుల కింద సుమారు లక్ష ఎకరాల వరకు సాగులోకి తెచ్చే ప్రయత్నాల్లో రైతులు బిజీగా కనిపిస్తున్నారు. సొంత నీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే వరి నార్లు పోసుకుని సాగుకు సిద్ధంగా ఉన్నారు.
సాగర్ ఆయకట్టు పరిధిలో 2015 యాసంగి తర్వాత తొలిసారిగా రైతుల భూములు పడావు పడనున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లక్ష ఎకరాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో సాగునీరు అందనున్నా మిగతా 3 లక్షల ఎకరాలకు సాగునీరు లేనట్టే. దీంతో ఈ 3 లక్షల ఎకరాలు బీడుగానే ఉండనున్నాయి. నాన్ ఆయకట్టులో బోర్లు, బావులపై ఆధారపడే రైతులు యాసంగిలో కొంతమేర వరితోపాటు మెట్ట పంటలైన వేరువనగ, పెసర, మినుము వంటివి పండిస్తారు. కానీ, సాగర్ ఆయకట్టులో అలాంటి పరిస్థితి లేక పూర్తిగా బీళ్లుగా మారనున్నాయి. మరోవైపు సొంత సాగునీటి వసతి ఉన్న రైతులు సైతం వరికి బదులుగా మెట్ట పంటలు సాగుచేస్తేనే మేలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. చివరి దశలో నీరు ఎక్కువగా అవసరమున్న సందర్భాల్లో భూగర్భ జలాలు అడుగంటితే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. అందువల్ల మెట్ట పంటల వైపు మొగ్గు చూపితేనే బెటర్ అని పేర్కొంటున్నారు.
సాగర్ ఆయకట్టు కింద నాకు మూడెకరాల భూమి ఉంది. ఈ పదేండ్ల సంది పంటలు మంచిగానే పండినయి. ఈ ఏడాది సాగర్ కాల్వకు నీళ్లు రాక వానకాలం, యాసంగి బీడు పెట్టిన. కాల్వ కింద భూముల్లో మెట్ట పంటలు పండే పరిస్థితి లేదు. గతంలో మినుములు, పెసర్లు వర్షాలకు సాగు చేసినా, ఎన్నడూ పంటలు చేతికి రాక నష్టాలే మిగిలినయ్. అందుకే ఈ ఏడాది ఏ పంటా వేయలేదు. పంటలు పండించకపోవడంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారింది. మాలాంటి సన్నకారు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
-ఎలకాని రమణ, రైతు, దొండవారిగూడెం, మిర్యాలగూడ మండలం
నేను కొన్నేండ్లుగా 12 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. ఆరెకరాలు సొంతం కాగా, మరో ఆరెకరాలు కౌలుకు తీసుకున్న. గతంలో సాగర్ ఎడమ కాల్వ నీళ్లు రావడం వల్ల వరి సాగుకు ఎలాంటి ఇబ్బంది పడలేదు. ఈ ఏడాది సరిపడా సాగు నీరు ఇవ్వక పోవడంతో బోర్ల కింద 8 ఎకరాలు మాత్రమే వరి వేసిన. వారం, పది రోజులుగా కరెంట్ సక్రమంగా ఉండట్లేదు. కరెంట్ కోతలు ఎక్కువయ్యాయి. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ రావట్లేదు. కరెంట్ సరఫరా ఇలాగే ఉంటే పంట పొట్ట దశకు వచ్చినప్పుడు ఎండిపోయే పరిస్థితి వస్తదేమోనని భయంగా ఉంది.
-అనుముల సుధాకర్రెడ్డి, రైతు,త్రిపురారం
నాకు నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. గతేడాది వరకు ప్రభుత్వం ఎడమ కాల్వకు సాగునీరు ఇవ్వడంతో వరి మంచిగా సాగు చేసిన. ఈ ఏడాది వానకాలంతోపాటు యాసంగిలో ప్రభుత్వం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయకపోవడంతో భూమి పడావు పెట్టాల్సి వచ్చింది.
-లకుమల్ల మధుబాబు, రైతు, ఎర్రబెల్లి, నిడమనూరు మండలం
నాగార్జున సాగర్ నిర్మాణం అయిన తరువాత వరుసగా తొమ్మిదేండ్ల పాటు రెండు కార్లకు ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసిన దాఖలాలు లేవు. కానీ, స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం 2015 మినహా వరుసగా 17 కార్లు ప్రణాళికాబద్ధంగా సాగునీరు ఇచ్చింది. సాగునీటిని సద్వినియోగం చేసి రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన ఘనత కేసీఆర్దే. కేసీఆర్ ప్రభుత్వం చేసిన మేలును రైతులు ఎప్పటికీ మరువరు.
-రాయనబోయిన రామలింగయ్య, రైతు, పేరూరు, అనుముల మండలం