సూర్యాపేట రూరల్, మార్చి 20: కాల్వ నీళ్లు వస్తాయనుకొని వరి సాగు చేసిన రైతులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. కనీసం బోర్లు, బావులు ఆదుకుంటాయన్న దశలో.. అవీ ఎండిపోవడంతో పొట్టకొచ్చిన వరి పంటలు ఎండిపోతున్నాయి. ఫలితంగా అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన రైతులు.. దిక్కుతోచని స్థితిలో ఎండిపోతున్న పైర్లను చూస్తూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అందుకు.. బుధవారం సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామ ఆవాసం దుబ్బతండాకు చెందిన ధరావత్ నర్సింహ.. ఎండిపోతున్న తన వరిపంటను చూసి కన్నీరుపెట్టుకున్న ఉదంతమే ఉదాహరణ. నర్సింహ తనకున్న అర ఎకరం భూమికి తోడు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేశాడు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం జలాలతో నాలుగున్నర ఎకరాల భూమిని సాగు చేస్తూ కారుకు సుమారు 20 పుట్ల వడ్లు పండించాడు.
ఇప్పుడు ఎస్సారెస్పీ నీళ్లు రాకపోవడంతో సాగుచేసిన మొత్తం పంట పొట్ట దశకు వచ్చేసరికి ఎండిపోయింది. పంటలు పండకున్నా భూమి యజమానికి కౌలు కింద ఎకరానికి రూ.14 వేలు ఎలా ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చెందుతూ.. ఎండిన పొలంలో పడి బోరున ఏడ్చాడు. ఇప్పటికే పంటలు సాగు చేసేందుకు రూ.50 వేలు పెట్టుబడి ఖర్చు చేసినట్టు వాపోయాడు. ఎస్సారెస్పీ కాల్వ కింద తండా రైతులు పెద్ద మొత్తంలో పంటలు సాగు చేయగా.. నీళ్లు రాకపోవడంతో ఎండిపోయినట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.