బచ్చన్నపేట, ఫిబ్రవరి 19: కన్నబిడ్డలా సాకిన వరి పొలం కండ్లముందే ఎండిపోయింది. రైతు గుండె తల్లడిల్లింది. సాగు కోసం వేసిన బోర్లు, ఇతర ఖర్చులతో గుట్టలా పెరిగిన రూ.32 లక్షల అప్పు కుంగదీసింది. తీర్చేమార్గం కనిపించక ఉరే శరణ్యమనుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక రైతు ఉరేసుకున్నాడు.
ఈ దారుణ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని నారాయణపూర్లో సోమవారం చోటుచేసుకున్నది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు పరిదె సాయిమల్లయ్య (42)కు నాలుగెకరాల పొలం ఉన్నది. గతంలో మూడు బోర్లు వేయగా నీళ్లు పడలేదు. ఏడాది క్రితం మరో రెండు బోర్లు వేసినా కొద్దిగా మాత్రమే నీళ్లు పడ్డాయి.
ఈ యాసంగిలో నాలుగు ఎకరాల భూమిలో వరి నాటు వేశాడు. బోరు ఎత్తిపోవడంతో ఎకరం పొలం ఎండిపోయింది. గతంలో చేసిన అప్పులకు చెల్లి పెండ్లి కూడా తోడయింది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. సుమారు రూ.32 లక్షల వరకు అప్పులయ్యాయి. వాటిని తీర్చేమార్గం లేకపోవడంతో కుటుంబంలో తగాదాలు ఏర్పడ్డాయి.
తీవ్ర మనస్తాపం చెందిన సాయిమల్లయ్య సోమవారం ఉదయం వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భూములు యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ పరిధిలో ఉండటంతో రాజపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆలేరుకు తరలించారు. మృతుడికి భార్య సరిత, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులున్నారు.