హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): వీఆర్ఏల క్రమబద్ధీకరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ప్రభుత్వం జారీచేసిన జీవో 81, 85పై ఆఫీస్ సబార్డినేట్లు(ఓఎస్లు) దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు శుక్రవారం మూసివేయడంతో వీఆర్ఏల కుటుంబాల్లో సంతోషాలు నిండాయి. పలువురు వీఆర్ఏలు, ఓఎస్లు నాంపల్లిలోని ట్రెసా కార్యాలయానికి వెళ్లి అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డికి స్వీట్లు తినిపించి ఆనందం పంచుకున్నారు. నీరటి, మసూరు, లషర్, షేక్సింధ్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలుస్తూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20,555 మంది వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ ఈ ఏడాది జూలై 24న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 61 ఏండ్లలోపు వయసున్న 16,758 మందిని ఆగస్టు మొదటివారంలో ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసింది. మిగతావారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. పదో తరగతి వరకు చదివిన వారికి లాస్ట్ గ్రేడ్ సర్వీస్ (ఆఫీస్ సబార్డినేట్), ఇంటర్ చదివిన వారికి రికార్డ్ అసిస్టెంట్, డిగ్రీ, ఆపై చదివిన వారికి జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ వర్తింపజేసింది.
రెవెన్యూశాఖకు చెందిన 30 మంది ఆఫీస్ సబార్డినేట్లు జీవో 81, 85పై హైకోర్టును ఆశ్రయించారు. తమకు పదోన్నతులు కల్పించిన తర్వాతే వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం వీఆర్ఏల క్రమబద్ధీకరణపై ఆగస్టు 10న స్టే విధించడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వీఆర్ఏ వ్యవస్థ రద్దు కావడంతో పాత వేతనాలు చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. పే స్కేల్ వర్తించినా కోర్టు ఆదేశాలతో ఎంపాయిమెంట్ ఐడీ రాకపోవడంతో కొత్త వేతనాలు దక్కని పరిస్థితి నెలకొంది.
వీఆర్ఏల బాధలు అర్ధం చేసుకున్న ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని 30 మంది ఓఎస్లతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. మరోవైపు, తమ నిర్ణయంతో వారికి ఎలాంటి నష్టం కలగబోదని ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ఇది ఓఎస్లలో విశ్వాసం నింపింది. ఇంకోవైపు, చర్చలు కొలిక్కి రావడంతో పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు ఓఎస్లు అంగీకరించారు. ఓఎస్లు దాఖలు చేసిన ఉపసంహరణ పిటిషన్ను పరిశీలించిన జస్టిస్ మాధవిదేవి బెంచ్ కేసును మూసివేసినట్టు పేర్కొంది. కోర్టు తీర్పుతో వీఆర్ఏల క్రమబద్ధీకరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. దసరా పండగ తమకు ముందే వచ్చిందంటూ వీఆర్ఏలు సంబరాలు చేసుకున్నారు.
వీఆర్ఏల క్రమబద్ధీకరణపై హైకోర్టు స్టే విధించడంతో మూడు నెలలుగా వేతనాలు లేక అవస్థలు పడుతున్నారు. దసరా పండుగపూట పస్తులుండే పరిస్థితి నెలకొన్నది. సమస్య పరిష్కారానికి ట్రెసా తరఫున ఓఎస్లతో మాట్లాడి పిటిషన్ విత్డ్రాకు ఒప్పించాం. పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం కేసును మూసివేయడంతో 20 వేలకుపైగా కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది.
-వంగ రవీందర్రెడ్డి, ట్రెసా అధ్యక్షుడు