హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ లో మెట్రో రైల్ వ్యవస్థ విస్తరణకు మరో కీలక అడుగు పడింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న 105 కి.మీ. మార్గానికి అదనంగా మూడో దశలో 4 ప్యాకేజీలుగా 12 మార్గాల్లో చేపట్టే 278 కి.మీ. విస్తరణ పనులకు సమగ్ర ప్రాజెక్టు నివేదికల రూపకల్పనకు కసరత్తు మొదలైంది. ఈ డీపీఆర్లను రూపొందించే కన్సల్టెన్సీల కోసం హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ సంస్థ శనివారం టెండర్ నోటిఫికేషన్ను జారీ చేసింది. దాదాపు రూ.69,100 కోట్లతో 12 మార్గాల్లో పనులను చేపట్టేందుకు రాష్ట్ర మంత్రివర్గం గత నెల 31న ఆమోదం తెలిపింది. దీంతో మెట్రో అధికారులు 15 రోజుల వ్యవధిలోనే టెండర్లు పిలిచారు. టెండర్ల దాఖలుకు ఈ నెల 28ని తుది గడువుగా నిర్ణయించినట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
రెండు నెలల్లో ప్రాథమిక నివేదిక
మూడో దశ మెట్రో విస్తరణకు సంబంధించి పీపీఆర్ను 2 నెలల్లో రూపొందించాలని అధికారులు నిబంధన విధించారు. ట్రాఫిక్ సర్వేతోపాటు రైడర్షిప్ ఎస్టిమేట్స్, సోషియో ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్, ప్రత్యామ్నా యాలు తదితర అంశాలపై నివేదిక రూపొందించాలని టెండర్ నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. పీపీఆర్ రూపొందించిన తర్వాత 3 నెలల్లో డీపీఆర్ను రూపొందించాలని గడువు విధించారు. ఇందులో మెట్రో రైలుకు సంబంధించిన నిర్మాణాలతోపాటు మెట్రో స్టేషన్లు, డిపోలకు సంబంధించిన ప్రాంతాలు, మల్టీ మాడల్ ఇంటిగ్రేషన్, విద్యుత్తు సరఫరా, సిగ్నల్స్, ట్రెయిన్ కమ్యూనికేషన్, ఆపరేషన్ ప్లాన్, కోచెస్, వ్యయం అంచనా, చార్జీల వివరాలు, ఆర్థిక సంబంధ అంశాలపై విశ్లేషణలు ఉంటాయని ఎన్వీస్ రెడ్డి తెలిపారు.