Telangana Assembly Elections | హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 13 నక్సల్ ప్రభావిత నియోజకవర్గాల్లో పోలింగ్ను గంట ముందుగానే ముగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆయా నియోజకవర్గాల్లో నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నది. వీటిలో సిర్పూర్ కాగజ్నగర్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ నితీశ్కుమార్ వ్యాస్, డైరెక్టర్ (వ్యయం) పంకజ్ శ్రీవాస్తవ సోమవారం తెలంగాణ సీఈవో వికాస్రాజ్, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు బాస్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ సమయం కుదింపుపై నవంబర్ 3న ఎన్నికల సంఘం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు పేర్కొన్నది. పోలింగ్ బూత్ల నుంచి రిసెప్షన్ సెంటర్కు ఎన్నికల సిబ్బంది, ఈవీఎంలను పొద్దుపోకముందే తరలించడానికి అనువుగా ముందుగానే పోలింగ్ ముగించాలని పోలీసులు చేసిన సూచనతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
రాజకీయాలు, ఎన్నికలతో సంబం ధం లేకుండా తనిఖీల్లో పట్టుబడిన సామాన్యుల నగదును ఇచ్చేయాలని రాష్ట్ర అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. జిల్లా గ్రీవెన్సెస్ కమిటీల అనుమతి తర్వాత ఆ మొత్తాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయాలని యంత్రాంగాన్ని సూచించింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ నితీశ్కుమార్ వ్యాస్ మాట్లాడుతూ నవంబర్ 3 నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర అధికారులకు అదనపు సీఈవో లోకేశ్కుమార్, డిప్యూటీ సీఈవో సత్యవాణి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల వ్యయ పర్యవేక్షణ నోడల్ అధికారి మహేశ్ భగవత్, పోలీసు నోడల్ అధికారి సంజయ్కుమార్ జైన్ తమ పరిధిలో తీసుకున్న చర్యలను వివరించారు.
దివ్యాంగులు, వృద్ధుల కోసం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో 18 వేల వీల్చైర్లను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. వీటిని కొనుగోలు చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. ఓట్లను తొలగించడానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికి 10.60 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటన్నింటిని పరిష్కరించామని, మరో 10 వేల దరఖాస్తులను పరిశీలించాల్సి ఉందని, రెండు రోజుల్లో పరిష్కరిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. అక్టోబరు 9 తర్వాత ఓట్లను తొలగించడానికి వచ్చిన దరఖాస్తులను ఎన్నికల తర్వాతే పరిశీలిస్తామని స్పష్టం చేశారు.