హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తుల గడువు పెంపుపై విద్యాశాఖ తర్జనభర్జన పడుతున్నది. గడువును పెంచాలా? వద్దా? అన్న మీమాంసలో ఉన్నది. గతంలో మొదట ప్రకటించిన గడువును పెంచిన దాఖలాలు లేకపోవడం, ఈసారి దరఖాస్తులు తక్కువగా రావడంతో ఏం చేయాలన్న అంశంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నది. టెట్ దరఖాస్తుల గడువు బుధవారంతో ముగియనున్నది. మంగళవారం నాటికి టెట్కు 1,93,135 లక్షల దరఖాస్తులు వచ్చాయి. పేపర్-1కు 72,771, పేపర్-2కు 1,20,364 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోల్చితే దరఖాస్తులు భారీగా తగ్గడంతో గడువు పెంచే అంశంపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.
ఈసారి నిరుద్యోగులతోపాటు ఉపాధ్యాయులు కూడా దరఖాస్తులు చేస్తారని విద్యాశాఖ వర్గాలు ఆశించాయి. కానీ ఈసారి 2 లక్షల మంది కూడా దరఖాస్తు చేయలేదు. టెట్ ఫీజులను భారీగా పెంచడంతోనే ఇలా జరిగింది. ఒక పేపర్కు వెయ్యి, రెండు పేపర్లకు రూ.2 వేలకు ఫీజులను పెంచడంతో అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. వరుసగా సెలవుల రావడంతోనూ టెట్ దరఖాస్తులపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో టెట్ దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచి, ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉగాది, రంజాన్ పండుగల సెలవుల కారణంగా మీ సేవ సెంటర్లు పనిచేయలేదని, మరో మూడు రోజులు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.