E-Books | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎక్కడంటే అక్కడ… చదువుకొనేలా ఈబుక్స్ను సిద్ధం చేసింది. ఈ పుస్తకాలను పీడీఎఫ్లో ఐఎస్ఎంఎస్ ఫోర్టల్లో పొందుపరిచింది. ఒకే ఒక్క క్లిక్తో 1 నుంచి 10 తరగతుల వరకు అన్నిరకాల పాఠ్యపుస్తకాలను విద్యార్థులు ఉచితంగా పొందవచ్చు. ఇంగ్లిష్, తెలుగు, కన్నడ, ఉర్దూ, హిందీ, మరాఠీ, తమిళ మీడియాల్లో ఈ పుస్తకాలు లభిస్తాయి. ప్రభుత్వం ‘మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా డిజిటల్ బోధనకు ప్రాధాన్యం ఇచ్చి స్కూళ్లకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లను అందజేస్తున్నది. ఇప్పటికే పలు స్కూళ్లల్లో ప్యానళ్లను బిగించింది. ఇక 20 వేల మంది టీచర్లకు ట్యాబ్లను కూడా పంపిణీ చేస్తున్నది. ఈబుక్స్ను డౌన్లోడ్ చేసుకొని.. నేరుగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లను వినియోగించి బోధించవచ్చు.
డిజిటల్ పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల బడి సంచి (బ్యాగు) బరువు తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. పిల్లలు పుస్తకాలను బడికి మోసుకెళ్లాల్సిన పని ఉండదని పేర్కొంటున్నారు. వాస్తవానికి స్కూల్కెళ్లే పిల్లలను చూస్తే బాల హమాలీలను తలపిస్తున్నారు. పుస్తకాల బరువు కారణంగా 60 శాతం మంది పిల్లలు వెన్ను సంబంధ వ్యాధుల బారిన పడుతున్నట్టుగా పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బ్యాగ్ బరువును తగ్గించేందుకు తమిళనాడులో సెమిస్టర్సిస్టం, కొన్ని కేంద్రీయ విద్యాలయాల్లో బుక్స్ డిపాజిటివ్ చేసేందుకు లాకర్సిస్టంను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన ఈ – పుస్తకాలతోను ఇలాంటి ఉపయోగాలుంటాయని అధికారులంటున్నారు.
విద్యార్థులు, టీచర్లు isms -telangana, scert telangana వెబ్సైట్లలో ఈటెక్ట్స్బుక్స్ ఆప్షన్ను ఎంచుకొని పుస్తకాలను పొందవచ్చు.