Telangana | (నమస్తే తెలంగాణ, న్యూస్నెట్వర్క్) : పదేండ్ల తరువాత మళ్లీ పాతరోజులు వచ్చాయి. సాగునీటికి గడ్డుకాలం వచ్చింది. గలగల పారాల్సిన కాల్వలన్నీ నెర్రెలు పారాయి. కాల్వల్లో ఇంకిన నీళ్లన్నీ కర్షకుల కన్నీళ్లై పారుతున్నాయి. ఎండిన పొలాన్ని చూసి రైతుల గుండెలు మండుతున్నాయి. పచ్చని పొలాలు పశువుల మేతగా మారుతుంటే.. సకాలంలో నీళ్లిచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిన వేళ.. కడుపుమండిన అన్నదాతలు సాగునీటి కోసం రోడ్డెక్కుతున్నారు. పొట్టకొచ్చిన పంటను కాపాడుకునేందుకు తీరొక్క తిప్పలు పడుతున్నారు. కిలో మీటర్ల దూరం నుంచి నీళ్లు తీసుకొస్తూ అపరభగీరథులుగా మారుతున్నరు. ప్రాజెక్టుల నుంచి నీళ్లు విడుదల చేయాలని అధికారులకు వినతిపత్రాలు అందిస్తున్నారు. అయినా పట్టని అధికారులు, పాలకులు నిస్సహాయ స్థితిలో ఉండగా, పంటను కాపాడుకోవడానికి రైతులు అరిగోస పడుతున్నారు.
ఎస్సారెస్పీ 16 డీబీఏ కాల్వ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందించాలని కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని వంతడుపుల, నగరం, ఆకనపల్లి గ్రామాల రైతులు సోమవారం తహసీల్దార్ రాణికి వినతిపత్రం అందజేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఎల్లాయిపల్లి రైతులు రామునిపట్ల రాజీవ్ రహదారిపై సోమవారం ధర్నా నిర్వహించారు. అలాగే హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకూర్తి, పసరగొండ గ్రామాల రైతులు ల్యాదెళ్ల, ఆరెపల్లి ఎస్సారెస్పీ డీబీఎం-31 వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. పది రోజులుగా సాగునీరు రావడం లేదని ఎస్సారెస్పీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో అధికారులే చెప్పాలని, పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు సంజీవయ్య, దుబాసి రవి, సముద్రాల రాజు, సముద్రాల మధు ఆవేదన వ్యక్తం చేశారు.
నాకు ఎకరంన్నర భూమి ఉన్నది. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. కాళేశ్వరం నీళ్లు బంద్ కావడంతో బావులు అడుగంటిపోయాయి. రూ.35 వేలు ఖర్చు పెట్టి బావిలో పూడిక తీయించిన. రూ.60 వేలు ఖర్చు చేసి సైడ్బోర్లు వేయించిన. చెరువులను నింపితే పంటలు పండే అవకాశం ఉన్నది.
– కాశవేణి మల్లేశం, రైతు, గుమ్లాపూర్, కరీంనగర్ జిల్లా
మాకు మూడెకరాల పొలం ఉంది. పదేండ్లుగా పైర్లు పచ్చగా కళకళలాడుతుండె. పొలానికి కాలువ నీళ్లు వస్తుండె. డ్యాంకు నీళ్లు రాకపోవడంతో ఆ నీళ్లు ఆగిపాయె. ఉన్న రెండు బోర్లలో కూడ నీళ్లు తగ్గినయి. రూ.వేల పెట్టుబడులు పెట్టినం. కండ్లెదుట పంటలు ఎండుతుంటే ప్రాణం పోతుంది.
– మహాదేవి, మహిళా రైతు, పెంచికలపాడు, జోగుళాంబ గద్వాల జిల్లా
3 కిలోమీటర్ల దూరం నుంచి పైపులైన్ పరిచి పంటకు నీళ్లు అందిస్తున్న ఈ రైతు పేరు నేనావత్ హన్మానాయక్. వీళ్లది సాగర్ ఆయకట్టు పరిధిలోని నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కుంకుడుచెట్టు ఆవాస గ్రామమైన పానుగోతుతండా. ఆగి ఆగి పోస్తున్న మూడు బోర్లతో 3 ఎకరాల్లో వరిని కాపాడుకోలేక తుంగపాడు వాగు నుంచి 3 కి.మీ పొడవునా పైప్లైన్ వేసి నీళ్లు తీసుకొస్తున్నారు. కేవలం పట్టా పైపు కొనడానికే రూ.30 వేలకు పైగా ఖర్చు అయిందని వాపోయాడు.
– త్రిపురారం, మార్చి 4
ట్యాంకర్తో పొలానికి నీళ్లు పెడుతున్న ఈ రైతు పేరు కందుల పురుషోత్తంరెడ్డి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నారాయణగూడెంలో రెండు బోర్లతో మూడెకరాల్లో వేసిన ఈ రైతు వరి చేను పొట్టకొచ్చింది. కండ్లెదుట ఎండుతున్న పొలాన్ని చూడలేక రోజుకు రూ. 2 వేల చొప్పున ట్యాంకర్ మాట్లాడిండు. 10 రోజులుగా రెండు కిలోమీటర్ల దూరం నుంచి 8ట్యాంకర్ల నీటిని అందిస్తున్నాడు. ఇప్పటికే ఎకరానికి రూ.32 వేల పెట్టుబడి పెట్టిన రైతుకు నీటి కోసం మరో రూ.20 వేలు అదనంగా ఖర్చు అవుతుంది.
– మునగాల, మార్చి 4