హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): మానవాళికి ‘యాంటీ మైక్రోబియల్ రెసిసెస్టెన్స్’ (ఏఎంఆర్) ముప్పు పొంచి ఉన్నదని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) హెచ్చరించింది. అవసరం ఉన్నా లేకపోయినా విచ్చలవిడిగా యాంటీ బయాటిక్స్ను వాడితే వాటిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని వ్యాధికారక సూక్ష్మజీవులు పొందుతాయని తెలిపింది. దీంతో అవి కలిగించే వ్యాధులు యాంటీ బయాటిక్స్కు కూడా లొంగని స్థాయికి చేరుకుంటాయని, వాటినే ‘సూపర్ బగ్స్’గా పిలుస్తారని వివరించింది. ప్రస్తుతం ప్రజారోగ్య రంగం ఎదుర్కొంటున్న 10 ప్రధాన సమస్యల్లో ఏఎంఆర్ ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పేర్కొన్నది.
ఏఎంఆర్ వల్ల అధిక ముప్పు పొంచి ఉన్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉన్నట్టు వెల్లడించింది. ఏఎంఆర్ కారణంగా 2019లో ప్రపంచవ్యాప్తంగా 12.7 లక్షల మంది మరణించినట్టు తెలిపింది. దీన్ని నిలువరించడం కష్టమే అయినా ప్రజలు, ఆరోగ్య సిబ్బంది సహకరిస్తే సాధ్యమేనని డీసీఏ డీజీ కమలాసన్రెడ్డి చెప్పారు. అతిగా యాంటీ బయాటిక్స్ వాడితే పశువులు సైతం ఏఎంఆర్ స్థితికి చేరుకుంటాయని, వాటి ఉత్పత్తులను, మాంసాన్ని తినడం వల్ల మనుషులకు కూడా వ్యాపిస్తుందని తెలిపారు. హాస్పిటళ్లలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెకానిజం సరిగా లేకపోవడం, పారిశుద్ధ్య నిర్వహణ లోపం వంటివి కూడా ఏఎంఆర్కు కారణమవుతాయని చెప్పారు. దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలని, అతిగా యాంటీ బయాటిక్స్ను వాడొద్దని సూచించారు.