హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ధరణి పునర్నిర్మాణ కమిటీ బుధవారం సచివాలయంలో నాలు గు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నది. సిద్దిపేట, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాల కలెక్టర్లను హాజరు కావాల్సిందిగా ఇప్పటికే సమాచారం పంపింది.
ధరణి సమస్యలు, వాటి పరిష్కారానికి సలహాలు, తహసీల్దార్లు, ఆర్డీవోలు దర్యాప్తు నివేదికలు ఇచ్చే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, పోర్టల్లో ఆర్డీవో, తహసీల్దార్లకు అదనంగా కల్పించాల్సిన వెసులుబాట్లు, న్యాయ సంబంధ సమస్యలు, చేయాల్సిన మార్పులు, చేర్పు లు, నిజామాబాద్ జిల్లాలో భూభారతి వివరాలతో రావాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల నివేదికలను పరిశీలించిన అనంతరం ఎంపిక చేసిన ప్రాంతాలకు వెళ్లి భూ సమస్యలను అధ్యయనం చేయాలని ధరణి కమిటీ భావిస్తున్నది.
ధరణి కమిటీ మంగళవారం సచివాలయంలో రెవెన్యూశాఖ మంత్రి శ్రీనివాస్రెడ్డి, ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్తో సమావేశమైంది. ఇప్పటివరకు వివరాలను సభ్యులు మంత్రికి వివరించారు. లోక్సభ ఎన్నికల్లోగా ప్రభుత్వానికి ఒక మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిటీ నిర్ణయించిన విషయాన్ని మంత్రికి వివరించినట్టు తెలిసింది.