హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు రాష్ట్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ విధివిధానాలు రూపొందించింది. సీజనల్ వ్యాధులను అరికట్టే బాధ్యతను అడిషనల్ కలెక్టర్లకు అప్పగించింది. స్థానికసంస్థలు నిరంతరం పరిసరాలను శుభ్రం చేస్తూ శానిటేషన్ వ్యూహాన్ని అనుసరించాలని ఆదేశించిం ది. సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రాంతాలను హాట్స్పాట్గా గుర్తించి చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీచేసింది. సీజన్వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ తీసుకోవాల్సిన చర్యలపై ఎపిడమిక్సెల్ను ఏర్పాటు చేశామని, ఈ సెల్ (040-24651119 )24/7 పనిచేస్తుందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వానకాలంలో మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా, టైఫాయిడ్, డయేరియా, ఇంప్లూయెంజా, నిమోనియా, పాముకాటు, సీజనల్ జ్వరాలు ప్రబలే అవకాశాలున్నందున ప్రతి శుక్రవారాన్ని డ్రైడేగా పాటించాలని, వేడి నీరు తాగడం, వేడి పదార్థాలను తీసుకోవటం, కొవిడ్ నిబంధనలు పాటించాలని పేర్కొన్నది. యాంటీ లార్వా ఆపరేషన్స్, ఫాగింగ్ చేయాలని మార్గదర్శకాలు జారీచేసింది. వాటర్ ట్యాంకుల్లో క్లోరినేషన్ చేపట్టాలని తెలిపింది. వైద్య సిబ్బంది ఫీవర్ సర్వే నిర్వహించి మందులు పంపిణీ చేయాలని, మలేరియా, డెంగ్యూలపై ర్యాపిడ్ టెస్ట్లు నిర్వహించాలని సూచించింది.