హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయరంగానికి రూ.40 వేల కోట్లు కేటాయించాలని ఆ శాఖ కోరింది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల బడ్జెట్ పద్దులపై జరిగిన సమీక్షలో వ్యవసాయ శాఖ ఈ ప్రతిపాదన చేసింది. ఇందులో రైతుబంధు పథకం అమలుకు అవసరమైన నిధులను కూడా పొందుపర్చినట్టు అధికారులు తెలిపారు. వ్యవసాయ రుణ మాఫీకి మాత్రం ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని చెప్పారు. రుణమాఫీపై ప్రభుత్వ విధివిధానా లు ఇంకా ఖరారు కాకపోవడంతో బడ్జెట్లో ఎన్ని నిధులు కోరాలన్న దానిపై స్పష్టత లేదు. రుణమాఫీకి సంబంధించి కటాఫ్ తేదీపైనా అధికారులు తర్జన భర్జన పడుతున్నారు.
బడ్జెట్లో టీఎస్ఆర్టీసీకి రూ.5,300 కోట్లు కేటాయించడంతోపాటు కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగుల నియామకానికి తోడ్పాటు అందించాలని ఆ సంస్థ ప్రతిపాదించింది. ‘మహాలక్ష్మి’ పథకం విజయవంతమయ్యేందుకు సహకరించాలని, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి నెలా 1న జీతాలు అందేలా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఉద్యోగులకు సంబంధించిన బాండ్లు, పీఎఫ్, సీసీఎస్ బకాయిలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. బీసీ గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, ఓవర్సీస్ సాలర్షిప్ల సంఖ్య పెంచాలని కోరారు. కాగా, ఆర్టీసీలో ఖర్చులు తగ్గించుకోవాలని, ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషించాలని మంత్రి భట్టివిక్రమార్క సూచించినట్టు సమాచారం.
రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఆలయ సందర్శకుల సౌకర్యార్థం దేవాలయాలకు చెందిన ఖాళీ స్థలాల్లో కాటేజీలు నిర్మించాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖలకు చెందిన బడ్జెట్ ప్రతిపాదనలపై ఆయన మాట్లాడుతూ.. నాగోబా, మేడారం లాంటి గిరిజన జాతరలకు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలను అమలు చేయాలని తెలిపారు. పెద్దగా ఆదాయం లేని ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యం కోసం ఆర్థిక సాసహాయాన్ని అందించే పథకాన్ని మరింత సరళతరం చేయాలని సూచించారు.
రాష్ట్రంలో బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలను పునరుద్ధరించనునున్నట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ సమావేశాల్లో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, జాయింట్ సెక్రటరీ హరిత, బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బీ వెంకటేశం, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, కమిషనర్ అనిల్ కుమార్, ప్రిన్సిపాల్ సీసీఎఫ్ డోబ్రియల్, పర్యావరణ, అటవీ శాఖల ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.