Parigi | పరిగి, ఏప్రిల్ 11 : ఐదుగురు అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తి 15 గుంటల భూమి. అందులో తన వాటా 3 గుంటలు. ఈ భూమిని తన పేరుపై చేయించుకోవడానికి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయాడు. తనకు నలుగురు ఆడపిల్లలు. 3 గుంటల భూమితో నలుగురు ఆడపిల్లలను పోషణ కష్టమని, కౌలుకు భూమిని తీసుకుని సాగు చేశాడు. సాగునీళ్లు కరువై పంట దిగుబడి రాలేదు. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాలేదు. అప్పులతో సాగు చేస్తుండగానే, అనుకోని ప్రమాదం మరిన్ని కష్టాలను మోసుకొచ్చింది. కష్టాలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఆ రైతుకు బతుకు భారమనిపించి, చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. కంటికి రెప్పలా కాపాడుకునే తండ్రి కానరానిలోకాలకు వెళ్లడంతో ఆడబిడ్డల రోదనలు ఆకాశన్నంటాయి.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం హనుమాన్గండి తండాకు చెందిన రైతు ముడావత్ హరిశ్చందర్(50)కు నలుగురు ఆడపిల్లలు. ఐదుగురు అన్నదమ్ముల్లో ఒకడైన హరిశ్చందర్కు పూర్వీకుల నుంచి వచ్చిన ఉమ్మడి ఆస్తి 15 గుంటల భూమి ఉంది. ఈ భూమిలో హరిశ్చందర్ వాటాగా 3 గుంటలు వస్తుంది. ఈ భూమి తన పేరుపై చేయించుకోవాలనుకున్నాడు. అధికారుల తప్పిదం కారణంగా ప్రస్తుతం వాళ్ల అన్న పేరు మీద ఆ భూమి ఉంది. 3 గుంటల భూమితో నలుగురు ఆడపిల్లల పోషణ కష్టమని గ్రామంలోనే భూమిని కౌలుకు తీసుకున్నాడు. జాగీర్కు చెందిన కొంత భూమిని సాగు చేస్తూనే రెండేండ్ల క్రితం 15 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. పంట దిగుబడి తగ్గిపోవడంతో గత సంవత్సరం కౌలు భూమిని తగ్గించాడు. 5 ఎకరాల భూమినే కౌలుకు తీసుకున్నాడు.
ఇందులో మొక్కజొన్న, కంది పంటలు వేసినా దిగుబడి మాత్రం ఆశించినస్థాయిలో రాలేదు. రెండేండ్లు దిగుబడి రాకపోవడంతో పెట్టుబడి మీదపడింది. అప్పులు పేరుకుపోయాయి. అప్పులతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న హరిశ్చందర్కు విధి కూడా సహకరించలేదు. రోడ్డు ప్రమాదంలో ఆయన కాలు విరిగింది.తాను సాగుకు దూరమవడంతో ఆ భారం అతని భార్యపై పడింది. ఆయన భార్య ముడావత్ సుశీల కూడా పొలంలో జారిపడింది. ఆమెకు చేయి విరిగింది. దీంతో కుటుంబ బాధ్యతలు ఇంటి ఆడపిల్లలపై పడ్డాయి. ఇదే సమయంలో పెద్ద కూతురుకు సంబంధం కుదరడంతో పెండ్లి చేశారు. మొత్తంగా కుటుంబాన్ని అప్పులన్నీ చుట్టుముట్టాయి. దాదాపు 8 లక్షలకు పైగా అప్పులు అయ్యాయి. ఓ వైపు అప్పుల బాధ, మరోవైపు కుటుంబ జీవనం మరింత గగనం కావడంతో హరిశ్చందర్ ఫిబ్రవరి1 వతేదీన పంట చేను వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రైతు హరిశ్చందర్ బలవన్మరణం తరువాత ఆ కుటుంబం రోడ్డున పడింది. పెద్ద కూతురు పెండ్లి అయి అత్తారింటికి వెళ్లిపోయినా మిగిలిన ముగ్గురు ఆడపిల్లల భారం హరిశ్చందర్ భార్య సుశీలపైనే పడింది. సుశీల కూలీనాలీ చేసుకుంటూ ఆడపిల్లలను పోషించుకుంటుంది. హరిశ్చందర్ రెండవ కూతురు మౌనిక పరిగిలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివింది. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష రాయలేకపోయింది. పరీక్షలు పూర్తి చేసి, పై చదువులకు వెళ్లాలనుకున్న ఆ అమ్మాయి ఆర్థిక కష్టాలు అడ్డంకిగా మారాయి. మూడవ కూతురు నందిని పరిగి జిల్లా పరిషత్ హైస్కూలు నం.1లో పదవ తరగతి చదువుతున్నది. పది ఫలితాలు వచ్చాక తాను ఇంటర్మీడియట్ చదువాలనుకుంటున్నది. నాలుగో కూతురు మమత హనుమాన్గండిలోని ప్రాథమిక పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నది. తండ్రి మరణం కారణంగా ఈ ముగ్గురు ఆడపిల్లల చదువులు ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితులు ఉన్నాయి.
హరిశ్చందర్ చనిపోయి రెండు నెలలు దాటినా సర్కారు నుంచి ఇంత వరకు ఎటువంటి సహాయం అందలేదు. వారికున్న 3 గుంటల భూమి హరిశ్చందర్ అన్న పేరు మీద ఉండడంతో రైతు బీమా కూడా రాలేదు. మరోవైపు హరిశ్చందర్కు కాలు విరగడంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల కోటాలో రూ. 4 వేల పింఛన్ వచ్చేది. ఇప్పుడు హరిశ్చందర్ మరణంతో ఆ పింఛన్ కూడా ఆగిపోయింది. కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు తండ్రికి వచ్చే పింఛన్తోనే ఇళ్లు గడిచేదని ఆడపిల్లలు రోదిస్తూ చెప్పారు. కూలీనాలీ చేసుకుంటూ ఆడపిల్లల పోషణ చూసుకుంటున్న తనకు వెంటనే పింఛన్ మంజూరు చేయాలని, తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని హరిశ్చందర్ భార్య సుశీల కోరుతున్నది.