హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపీ అర్వింద్ను సామాన్య ప్రజలే చెప్పుతో కొట్టే రోజులొచ్చాయని దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ఎల్పీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, పట్నం నరేందర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో మహబూబ్నగర్ జిల్లా వాళ్ల కంటే ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారే ఎక్కువ ఉన్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. పాదయాత్రలో బండి సంజయ్..పిచ్చికుక్కలా మాట్లాడితే అర్వింద్ ఊరకుక్కలా మాట్లాడుతున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. సీఎం కేసీఆర్ స్థాయికి, హోదాకు, వయస్సుకు కనీస గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్న అర్వింద్ను టీఆర్ఎస్ కార్యకర్తలు కాదు సామాన్య కార్యకర్తలే చెప్పుతో కొట్టే రోజులొచ్చాయన్నారు.
డబుల్ ఇంజిన్ గ్రోత్ చూపే నాయకులు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఈ గ్రోత్ ఎక్కడికి పోయిందని ఆయన నిలదీశారు. రాష్ట్రం నుంచి నలుగురు ఎంపీలు గెలిచి ఏం పీకారని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు దమ్ముంటే జాతీయ హోదా కోసం బండి సంజయ్ ఢిల్లీకి మోకాళ్ల యాత్ర చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ను ఏమన్నా అంటే తాము చేతులు ముడుచుకుని కూర్చోమని ఎమ్మెల్యే హెచ్చరించారు.
తెలంగాణపై బీజేపీ నేతల కక్ష :ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
తెలంగాణపై బీజేపీ నేతలు కక్షకట్టారని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పురోగమిస్తున్న రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలకు చేతనైతే మంచిపనులు చేయాలని, పిచ్చిమాటలు మానుకోవాలని ఆయన సూచించారు. బీజేపీ నేతలు తమ వైఖరి మార్చుకుంటే వారికే మంచిదన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్పై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని తము ఖండిస్తున్నామన్నారు.
పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురండి: ఎమ్మెల్యే పట్నం
బీజేపీ నేతలకు దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కాలి గోటికి కూడా సరిపోని బీజేపీ నేతలు ఇష్టారీతిగా మాట్లాడితే తాము చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఏడేండ్ల కాలంలో దేశాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిన బీజేపీ నేతలు బాగుపడుతున్న తెలంగాణను చూసి ఓర్వలేక ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.