శంకరపట్నం, సెప్టెంబర్ 3: పెండ్లింట విషాదం అలుముకున్నది. పెండ్లి కూతురు తండ్రి గుండెపోటుతో మరణించడంతో వివాహం అర్ధాంతరంగా నిలిచిపోయింది. పెద్దదిక్కు తనువుచాలించడంతో బంధుమిత్రుల రోదనలతో దద్దరిల్లింది. ఈ విషాద ఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్పూర్లో జరిగింది.
గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఎర్రల రాములు (48) ట్రాక్టర్ మెకానిక్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతరు లావణ్య వివాహం ఆదివారం ఉదయం 10-00 గంటలకు కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి గుట్టపై జరగాల్సి ఉన్నది.
మరో రెండు గంటల్లో వివాహ తంతు మొదలు కావాల్సి ఉండగా.. పెళ్లి కూతురు తండ్రి రాములు చాతిలో నొప్పిరావడంతో కుప్పకూలారు. గమనించిన బంధువులు హూటాహుటిన హుజూరాబాద్ ప్రభుత్వ దవఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రాములు మరణించినట్లు నిర్ధారించారు. రాములు మరణంతో భార్యాబిడ్డలు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.