నాగర్కర్నూల్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): దళితుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఫలాలు అందివస్తున్నాయి. తొలుత నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టగా వంద శాతం యూనిట్ల పంపిణీ దిశగా పరుగులు తీస్తున్నది. ఇప్పటికే 90 శాతం యూనిట్ల పంపిణీ పూర్తయ్యింది. మొత్తం 1,709 యూనిట్లు మంజూరు కాగా ఇప్పటివరకు 1,627 మంది యూనిట్లు నెలకొల్పడం విశేషం. సమాజంలో అట్టడుగున ఉన్న దళితులను అభివృద్ధిలో భాగం చేసేందుకు సీఎం కేసీఆర్ 2021 ఆగస్టు 16న ఈ పథకాన్ని ప్రారంభించారు. తొలుత రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో చారకొండ ఒకటి. ఈ మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో సర్వే చేపట్టిన అధికారులు 1,709 మందిని పథకానికి అర్హులుగా గుర్తించారు. గత ఏడాది జనవరిలో పథకం అమలుకు శ్రీకారం చుట్టిన అధికారులు దశలవారీగా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేశారు. వంద శాతం సబ్సిడీతో దళితులు కోరిన పథకాలకు రుణాలను పారదర్శకంగా అందజేశారు. లబ్ధిదారుల్లో అత్యధికులు రవాణా రంగం ద్వారానే ఉపాధి పొందేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. కార్లు, జేసీబీలు, డీసీఎం, ట్రాక్టర్లులాంటి వాహనాలను కొనుగోలు చేశారు. మరికొందరు చికెన్ దుకాణాలు, సెంట్రింగ్, టెంట్హౌస్, డీజేసౌండ్ లాంటి యూనిట్లను ఎంచుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఇతర అధికారుల సమన్వయంతో లబ్ధిదారులకు ఆయా యూనిట్లను మంజూరు చేశారు.
దళితబంధు పథకం సమాజంలో అట్టడుగున ఉన్న దళితుల అభ్యున్నతికి దోహదపడుతున్నది. ఈ పథకం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన చారకొండలో వంద శాతం యూనిట్ల పంపిణీ దాదాపుగా పూర్తయింది. 1,708 యూనిట్లకుగాను 1,627 యూనిట్ల పంపిణీ పూర్తయింది. కేవలం 152 యూనిట్లు మాత్రమే పంపిణీ చేయాల్సి ఉన్నది. నెలాఖరులోగా మిగిలిన ప్రక్రియ పూర్తవుతుంది.
– ఉదయ్కుమార్, నాగర్కర్నూల్ కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో మాలాంటి పేదలకు ఎంతో లబ్ధి చేకూరింది. గతంలోని ప్రభుత్వాలు మమ్ములను ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం కేసీఆర్ సార్ మాకు దళితబంధు పథకం కింద మంజూరు చేసిన డబ్బుతో హార్డ్వేర్ షాపు పెట్టుకున్నా.
– పవన్, జూపల్లి, వెల్దండ మండలం, నాగర్కర్నూల్ జిల్లా
దళితబంధు పథకంతో ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా జేసీబీ కొనుకున్నా. ఇప్పుడు సొంతంగా నా పని నేను చేసుకుంటున్నా. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో నాకు మంజూరైన డబ్బు నా కష్టాలను తీర్చింది. ఇప్పుడు నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. చాలా సంతోషంగా ఉన్నది.
– మహేశ్, అప్పారెడ్డిపల్లి, నాగర్కర్నూల్ జిల్లా