ఓదెల, మార్చి 20: ఈదురు గాలులకు తెగిపడ్డ విద్యుత్తు తీగ ఓ కౌలురైతును పొట్టన పెట్టుకున్నది. పొలం ఒడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తూ గమనించకుండా వైర్పై అడుగేయడంతో షాక్కు గురై అక్కడికక్కడే మరణించాడు. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తిలో బుధవారం చోటుచేసుకున్నది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుండారం రాజయ్య (62) ఓ రైతు వద్ద రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు.
మంగళవారం రాత్రి బలంగా ఈదురు గాలులు వీయడంతో కరెంట్ వైర్లు తెగి ఒడ్డుపై పడ్డాయి. రోజులాగే రాజయ్య పొలాన్ని చూసేందుకు ఒడ్డు పైనుంచి నడుచుకుంటూ వెళ్తుండగా, ఒడ్డు పైన ఉన్న కరెంట్ వైరు అతడి కాలుకు తగలడంతో విద్యుత్తు షాక్కు గురై మరణించాడు. మృతుడికి భార్య. ఇద్దరు కొడుకులు, బిడ్డ ఉండగా ఇటీవలే ఓ కొడుకు అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అశోక్రెడ్డి తెలిపారు. ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యంతోనే రాజయ్య మరణించాడని గ్రామస్థులు ఆరోపించారు. ఘటనా స్థలానికి వచ్చిన సిబ్బందిని నిలదీశారు. కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ సర్పంచ్ అరెల్లి మొండయ్యగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.