హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అప్పులు గణనీయంగా పెరుగుతున్నాయని వ్యాఖ్యానించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు మరోసారి ట్విట్టర్ వేదికగా చురకలు అంటించారు. ‘ఆర్థిక మంత్రి అప్పుల గురించి అనర్గళంగా నీతులు చెప్పారు. అసలు నిజాలు ఇవిగో’ అంటూ లెక్కలు బయటపెట్టారు. ‘2014 వరకు 67 ఏండ్లలో 14 మంది భారత ప్రధానులు కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పు చేశారు. అనంతరం ప్రధానిగా వచ్చిన మోదీ గత 8 ఏండ్లలో దేశ అప్పును రూ.100 లక్షల కోట్లకు పెంచారు. ఈ లెక్కన ఇప్పుడు ప్రతీ భారతీయుడిపై రూ.1.25 లక్షల అప్పు ఉన్నది’ అని ట్వీట్ చేశారు.
‘2021 అక్టోబర్లో ఆర్బీఐ నివేదిక ప్రకారం దేశ జనాభాలో 2.5% ఉన్న తెలంగాణ దేశ జీడీపీకి 5.0% సహకరిస్తున్నది. 2022లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.78 లక్షలైతే, జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.1.49 లక్షలు. అప్పుల్లో తెలంగాణ జీఎస్డీపీ నిష్పత్తి 23.5శాతమేనని (దేశంలోని 28 రాష్ర్టాల్లో అత్యల్పంగా 23వ స్థానం). ఇదే సమయంలో దేశ అప్పు నిష్పత్తి 59%’ అని వివరించారు. ‘దేశానికి కావాల్సింది డబుల్ ఇంపాక్ట్ గవర్నెన్స్. పనికిరాని డబుల్ ఇంజిన్లు కాదు’ అంటూ చురకలంటించారు. బీజేపీ రాష్ర్టాలు తెలంగాణతో సమానంగా పనిచేస్తే భారతదేశం ఇప్పటికే 4.6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉండేది’ అని పేర్కొంటూ కేటీఆర్ వరుస ట్వీట్లు చేశారు.