సూర్యాపేట : గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజలు పల్లె ప్రగతి లో పాల్గొని గ్రామాలను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. బుధవారం జిల్లాలోని ఆత్మకూరు ఎస్ మండలం ఏపూరు గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి కలసి ఆయన పాల్గొన్నారు.
గ్రామంలో పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, నర్సరీ, డంపింగ్ యాడ్, వైకుంఠ ధామం పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి పలు సూచనలు చేశారు. అనంతరం జీపీలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పల్లె ప్రగతిని 2019 న ప్రారంభించిన నాటి నుంచి గ్రామాల్లో ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలన్నారు.
గ్రామాలలో పరిశ్యుధ్యం, పచ్చదనాన్ని పెంపొందించడానికి అలాగే.. గ్రామ పంచాయతీ పరిపాలనలో పారదర్శకత తీసుకరావడానికి ప్రభుత్వం సెప్టెంబర్ 2019 నుంచి పల్లె ప్రగతి ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామాలు మునుపెన్నడూ ఎరుగని రీతిలో అభివృద్ధిలో ముందుకు పోతున్నాయని ప్రశంసించారు.
గ్రామాలలో నాటిన మొక్కలు 80 శాతం సంరక్షించాలని, లేకపోతే ఆయా గ్రామ సర్పంచ్ లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ నిధులతోనే ట్రాక్టర్, ట్యాoకర్, ట్రాలీ కొనుగోలు చేయడం పై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. అనంతరం మహిళ సంఘాలకు స్త్రీ నిధి బ్యాంక్ చెక్కులను అందజేశారు.
కార్యాక్రమంలో జెడ్పీ సీఈఓ సురేష్, డీపీవో యాదయ్య, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, ఎంపీపీ మర్ల స్వర్ణలత రెడ్డి, సర్పంచ్ రజిత, ఎంపీడీఓ మల్సూర్, ఎంపీవో సంజీవయ్య, తహసీల్దార్ హేమ మాలిని, తదితరులు పాల్గొన్నారు.