మునుగోడు, ఫిబ్రవరి 24: యావత్ దేశం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకొంటున్నదని, రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే అందుకు కారణమని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. చెక్కులతో ఇంటికి వచ్చిన మంత్రి జగదీశ్రెడ్డికి మహిళలు నీరాజనాలు పలికారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన మిషన్ భగీరథ నీటితో ఫ్లోరోసిస్ మటుమాయమైందన్నారు. దశాబ్దాల తరబడి మునుగోడు నియోజకవర్గాన్ని అతలాకుతలం చేసిన ఫ్లోరోసిస్ను పారదోలిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా పరుగులు పెడుతుంటే యావత్ దేశం చూపు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం వైపు మళ్లిందన్నారు. వ్యవసాయ రంగానికి 24 గం టల నిరంతర ఉచిత విద్యుత్తు మొదలు రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలు సీఎం కేసీఆర్ గొప్పతనానికి గీటు రాయిగా నిలుస్తాయని చెప్పారు. వరుసగా పదేండ్లు కరువు వచ్చినా రాష్ట్రంలో సాగు, తాగునీటి కొరత లేకుండా సీఎం కేసీఆర్ అద్భుతమైన నీటిపారుదల వ్యవస్థను రూపొందించారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలమైందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయని, తెలంగాణ నెత్తిన నీటి కుండ మల్లన్నసాగర్ అని మంత్రి అభివర్ణించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.