హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సేవలు అత్యవసరమని, దేశానికి ఆయన నాయకత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైందని పలు రాష్ర్టాల రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేందుకు కదిలి రావాలని రాష్ట్ర రైతులకు పిలుపునిచ్చారు. కర్ణాటక, తమిళనాడు, హర్యానా, కేరళ, ఏపీతోపాటు పలు రాష్ర్టాలకు చెందిన 15 మంది రైతు సంఘాల నాయకుల బృందం రెండు రోజులపాటు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. అనంతరం వారు మంగళవారం హైదరాబాద్లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో ఉన్న రైతుబంధు సమితి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన గొప్ప అనుభూతి ఇచ్చిందని సంతోషం వ్యక్తంచేశారు.
కాళేశ్వరం ప్రపంచ అద్భుతం
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యద్భుతమని, అంత పెద్ద ప్రాజెక్టును మూడేండ్లలోనే నిర్మించడం గొప్ప విషయమని రైతు నాయకులు కొనియాడారు. తెలంగాణ రైతులకు కేసీఆర్ చేయాల్సినవన్నీ చేశారని, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తుతోపాటు కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ, ఆసరా పెన్షన్లు, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ వంటి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలకు ఎంతో మేలు చేశారని ప్రశంసించారు. దేశంలో ఇలాంటి పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవని చెప్పారు. సమావేశంలో ఆల్ ఇండియా పసుపు రైతుల సంఘం ఉపాధ్యక్షుడు నర్సింహం నాయుడు, 108 సంఘాల తమిళనాడు ఫార్మర్స్ అసోసియేషన్ చైర్మన్ పీకే దైవ శిగామణి, కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు శాంతకుమార్, తమిళనాడు వ్యవసాయ సంఘం అధ్యక్షుడు రామ గౌండర్, ఆల్ ఇండియా ఫార్మర్స్ అలయన్స్ జాతీయ కన్వీనర్ రాజారాం త్రిపాఠి, కర్ణాటక రైతు సంఘం ప్రధాన కార్యదర్శులు విమల్ కుమార్, రమేశ్ హుగర్, బీకేయూ హర్యానా అధ్యక్షుడు సేవా సింగ్, మాంగే రామ్, రాంబాబు, రాజేంద్రన్, టీవీఎస్ నాగ్పాల్, షణ్ముగ సుందరం తదితరులు పాల్గొన్నారు. బుధవారం హరిత హోటల్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.
భవిష్యత్ దర్శనం ఉన్న నేత కేసీఆర్
కేసీఆర్ సేవలు దేశానికి ఎంతో అవసరం. కాళేశ్వరం.. వరల్డ్ క్లాస్ ప్రాజెక్టు. ఇదో మిరాకిల్. దాన్ని చూస్తే గొప్ప ఫీలింగ్ కలిగింది. సీఎం కేసీఆర్ ఫ్యూచర్ ప్లానింగ్ మాస్టర్.
-దైవ శిగామణి, తమిళనాడు ఫార్మర్స్
అసోసియేషన్ చైర్మన్ కేసీఆర్ ఆధునిక భగీరథుడు
తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధరపై తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. పసుపు బోర్డు కావాలని అడిగితే పట్టించుకోవడం లేదు. కేంద్రానికి తగిన గుణపాఠం చెప్పాలి. కేసీఆర్ను కర్ణాటక ప్రజలు ‘ఆధునిక భగీరథుడు’గా పిలుచుకొంటున్నారు.
-శాంత కుమార్, కర్ణాటక ఫార్మర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు
నీళ్లను కింది నుంచి పైకి తేవడం అద్భుతం
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రాష్ర్టానికే తలమానికం. నీళ్లను కింది నుంచి పైకి తీసుకొచ్చి రైతులకు సాగునీటి గోస తీర్చిన తీరు ఎంతో గొప్పది. ఇతర రాష్ర్టాల్లో యువత వలసలు పోతుంటే తెలంగాణలో యువత వలసలు అగిపోయాయి.
-సేవా సింగ్, బీకేయూ హర్యానా అధ్యక్షుడు
కేంద్రంపై పోరాటం ఆగదు
రైతుల సమస్యలపై ఇప్పటికే ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా బీజేపీ సర్కారు కనీసం వినిపించుకోవడం లేదు. ఎంఎస్పీకి చట్టబద్ధత, పసుపుబోర్డు కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. కాళేశ్వరం త్రీ డైమెన్షన్ (3డీ) ప్రాజెక్టు. ఒక్క ప్రాజెక్టుతో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, డ్రింకింగ్ వాటర్ సమస్య తీరుతుంది. ప్రపంచంలోనే ఇదొక గొప్ప ప్రాజెక్టు.
-రామ గౌండర్, తమిళనాడు వ్యవసాయ సంఘం అధ్యక్షుడు
అంతా ఆశ్చర్యపోయారు
ఇటీవల పలు రాష్ర్టాల రైతు సంఘాల నాయకులం చెన్నైలో సమావేశమయ్యాం. ఈ సందర్భంగా తెలంగాణలోని సంక్షేమ పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఆ ప్రాజెక్టును నేరుగా చూడాలని వారంతా కోరారు. అందుకే ఇక్కడికి ఆహ్వానించి ప్రాజెక్టును చూపించాము. ప్రాజెక్టును చూసి, దాని విశేషాలు తెలుసుకొని అంతా ఆశ్చర్యపోయారు. ఇలాంటి ప్రాజెక్టు కేసీఆర్ వంటి వారితోనే సాధ్యమవుతుందని కొనియాడారు. ఇలాంటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు వారి రాష్ర్టాల్లోనూ అమలు చేసేందుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.
-నర్సింహం నాయుడు, ఆలిండియా పుసుపు రైతుల సంఘం ఉపాధ్యక్షుడు