సూర్యాపేట : దేశం ఐక్యంగా ముందుకు పొంతుందంటే అది డా. బాబా సాహెబ్ అంబేద్కర్ వల్లే అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. రాజ్యంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముందు చూపువల్లే నేడు మన దేశంలో రిజర్వేషన్లు అమలవుతున్నాయని మంత్రి అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సమాజంలో దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు అవకాశాలు లభిస్తున్నాయంటే కారణం అందుకు అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లు మాత్రమే అన్నారు.
అంబేద్కర్ గురించి మాట్లాడుకోవడం మన అదృష్టం అనడం కంటే అది ఆయన గొప్పతనంగా అభివర్ణించారు. అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా కులాలు, మతాలు అంటూ చిచ్చు రేపడానికి ప్రజల మధ్య కు వస్తున్న వారి పట్ల ప్రజలు జాగ్రత్త గా ఉండాలని మంత్రి సూచించారు. అంతకు ముందు అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన పోటీలలో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందించడంతో పాటు, కులాంతర వివాహాలు చేసుకుని ఆదర్శంగా నిలిచిన సూర్యాపేట జిల్లాకు చెందిన 9 మంది ఆదర్శ దంపతులకు 2లక్షల 50 వేల రూపాయల చొప్పున నగదు చెక్ లను మంత్రి అందజేశారు.
కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జా దీపికా, వైస్ చైర్మన్ గోపాగాని వెంకట్ నారాయణ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, జడ్పీటీసీ జీడీ భిక్షం, పెన్ పహాడ్ ఎంపీపీ నెమ్మాది భిక్షం తదితరులు పాల్గొన్నారు.