కరీంనగర్ : దేశంలోని దెయ్యాలను తరిమి కొట్టేందుకు అల్లాను ప్రార్థించాలని
బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ దేశాల ముందు భారత్ తలదించుకునే పరిస్థితి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కరీంనగర్లో హజ్ యాత్రికులకు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడారు.
సర్వ మతాలకు నిలయం భారతదేశం. మత రాజకీయాలు చేస్తూ ఇతర మతాలను కించపరిస్తే సహించేది లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభ్వుత్వం అన్ని మతాలకు సమాన గుర్తింపు ఇస్తుందన్నారు. అన్ని మతాల పండుగలను వారి సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే.
ఇందులో భాగంగానే జిల్లా నుంచి హాజ్ యాత్రకు వెళ్లే వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసిందన్నారు. కులమతాలకు అతీతంగా అభివృద్ధి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. బీజేపీది ఒక మతాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలని కుటిల మనస్తత్వం అని మండిపడ్డారు.
అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి ముస్లిం సోదరులు సహకరించాలన్నారు.